బాబు పర్యటనపై సమీక్ష
ABN , First Publish Date - 2022-12-07T01:10:31+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 9న బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు.
బాపట్ల, డిసెంబరు 6: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 9న బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాపట్లలో మకాం వేశారు. పర్యటన విజయవంతం చేసేందుకు బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మతో మంగళవారం రాత్రి ఆయన జనసమీకరణపై చర్చించారు. శుక్రవారం 3.15 నిమిషాలకు చుండూరుపల్లి రానున్న చంద్రబాబుకు బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. ఈతేరు, అప్పికట్ల మీదగా చీలురోడ్డుకు చేరుకుని అక్కడ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు రోడ్డుషో నిర్వహిస్తారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రి 8 గంటలకు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజిలో బస చేయనున్నారు. 10వ తేది ఉదయం 11 గంటలు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీసీ నాయకులతో ఇంజనీరింగ్ కళాశాలలో అధినేత సమావేశమౌతారు. మధ్యాహ్నం 2గంటలకు స్టూవర్టుపురంలో మహిళలతో సమావేశం అవుతారు. అక్కడ నుంచి చీరాలకు వెళ్లనున్నట్లు వారు తెలిపారు. ఆయా కార్యక్రమాల్ని విజయవంతం చేసేందుకు పార్టీశ్రేణులందరిని సమన్వయ పర్చాలని సాంబశివరావు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి తాతా జయప్రకాష్ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తానికొండ దయాబాబు, పంగులూరి శ్రీనివాసరావు, మార్కెట్యార్డు మాజీ ఛైర్మన్ రావిపూడి నాగమల్లేశ్వరరావు తదితరులు ఉన్నారు.