అమరావతి అభివృద్ధిపై కాలయాపన తగదు
ABN , First Publish Date - 2022-07-06T05:53:40+05:30 IST
అమరావతి అభివృద్ధిపై కాలయాపన తగదని రాజధానికి భూములు త్యాగంచేసిన రైతులు పేర్కొన్నారు.
931వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు
తుళ్ళూరు, జూలై 5: అమరావతి అభివృద్ధిపై కాలయాపన తగదని రాజధానికి భూములు త్యాగంచేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 931వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం 33వేల ఎకరాలు భూములు ఇస్తే వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. భూములు ఇవ్వటమే రైతులు చేసిన నేరమా అని ప్రశ్నించారు. కాలయాపన చేయకుండా హైకోర్టు తీర్పును అమలు చేసి రాజధాని అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్నారు. ఇప్పటికైనా అమరావతి రాజధానిపై రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. లేదంటే తగిన మూల్యం తప్పదన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి బిల్డ్ అమరావతి, జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.