అమరావతిని అడ్డుకోలేరు

ABN , First Publish Date - 2022-08-17T05:30:00+05:30 IST

ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులకు పాల్పడినా అమరా వతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోలేరని, చివరికంటా పోరాడి సాధించు కుంటామని రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులు స్పష్టం చేశారు.

అమరావతిని అడ్డుకోలేరు
తుళ్లూరు రైతు ధర్నా శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

రాజధాని నిర్మాణాన్ని సాధించి తీరుతాం

అమరావతి ప్రాంత రైతులు, మహిళలు

974వ రోజుకు చేరుకున్న దీక్షలు, ఆందోళలను 

తుళ్ళూరు, ఆగస్టు 17: ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులకు పాల్పడినా అమరా వతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోలేరని, చివరికంటా పోరాడి సాధించు కుంటామని రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులు స్పష్టం చేశారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఆయా ప్రాంతాల రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు బుధవారం నాటికి 974వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిని సాధిస్తారన్న నమ్మకంతో ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెడితే రాష్ట్రానికి గుండె లాంటి రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. అభివృద్ధి నిరోదక వైసీపీని గెలిపించింనందుకు ఇప్పుడు ప్రజలు ప్రశ్చాత్తాప పడుతున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి రావడమే తడవుగా అమరావతి విచ్ఛిన్నానికి పూనుకున్నారని, ఆ ప్రాంత రైతులపై అనేక అబాండాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పాలకుల ఎన్ని అవరోధాలు సృష్టించినా, అవమానాలకు గురిచేసినా రాజధాని అమరావతిని సాధించే వరకు విశ్రమించేది లేదని శపథం చేశారు. ఇప్పటికైనా మూడు రాజధానుల మూడు ముక్కలాట మానుకొని, అమరావతి రాజధాని అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలను వెలగించి అమరావవతి వెలుగు కార్యక్రమం  నిర్వహించారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.    


Updated Date - 2022-08-17T05:30:00+05:30 IST