సర్వం వైసీపీ రంగులే..
ABN , First Publish Date - 2022-10-28T01:59:14+05:30 IST
కాకినాడలో జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని గురువారం రాత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ కార్యాలయానికి విద్యుత్ దీపాలు పూర్తిగా వైసీపీ రంగులతోనే ఏర్పాటు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ప్రభుత్వ భవనాలు ప్రారంభించడానికి సాధారణ విద్యుత్ దీపాల వెలుగులకు బదులుగా వైసీపీ విద్యుత్ దీపాలంకరణ చేయడంతో ఉద్యోగులంతా ముక్కన వేలేసుకున్నారు.
కాకినాడ జిల్లాలో ట్రెజరీ కార్యాలయాన్ని ప్రారంభించిన బుగ్గన రాజేంద్రనాథ్
కొత్త భవనానికి వైసీపీ రంగులతో విద్యుత్ దీపాలంకరణపై సర్వత్రా విమర్శలు
పోర్టుసిటీ(కాకినాడ), అక్టోబరు 27: కాకినాడలో జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని గురువారం రాత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ కార్యాలయానికి విద్యుత్ దీపాలు పూర్తిగా వైసీపీ రంగులతోనే ఏర్పాటు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ప్రభుత్వ భవనాలు ప్రారంభించడానికి సాధారణ విద్యుత్ దీపాల వెలుగులకు బదులుగా వైసీపీ విద్యుత్ దీపాలంకరణ చేయడంతో ఉద్యోగులంతా ముక్కన వేలేసుకున్నారు. ఎప్పుడూ లేని ఈ తరహా సంప్రదాయంపై మంత్రి సమక్షంలోనే ఉద్యోగులు తప్పుపట్టారు. ఇప్పటివరకు పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేసి పరువు దిగజార్చుకున్న ప్రభుత్వం కోర్టు మొట్టి కాయలతో కొంత వెనక్కి తగ్గిందని అనుకుంటే ఇప్పుడు మళ్లీ విద్యుత్ దీపాలంకరణ రంగులతో పార్టీ జెండాను ప్రదర్శించడం ప్రభుత్వ తీరును అపహాస్యం చేస్తోంది. కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవనానికి సైతం వైసీపీ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సంబంధిత అధికారులు అక్కడినుంచి ఫ్లెక్సీలు తొలగించారు.