వర్శిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-12-07T01:31:08+05:30 IST
విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జె.శ్యామలరావు సూచించారు.
జేఎన్టీయూకే, డిసెంబరు 6: విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జె.శ్యామలరావు సూచించారు. జేఎన్టీయూకేలోని వీసీ సమావేశహాల్లో ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్తో వర్శిటీలో చేపడుతున్న కార్యక్రమాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానం 2020 ఆశయాలకు అనుగుణంగా 2023-24 విద్యా సంవత్సరంలో మరింత పకడ్భందీగా యూజీ, పీజీ కోర్సుల పాఠ్యప్రణాళికను రూపొందించాలన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో చేసుకున్న ఒప్పందాల ననుసరించి కోర్సులను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. పరీక్షల విభాగంలోని స్పాట్ ఎవాల్యూయేషన్ మోనిటరింగ్ సిస్టమ్ను, పీహెచ్డీ ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టమ్ను మరింత పారదర్శకంగా నిర్వహించేలా కృషిచేయాలన్నారు. ప్రభుత్వంనుంచి వర్శిటీకి ఎటువంటి సహాయం కావాలన్నా తనవంతు పూర్తిసహకారమందిస్తానని తెలిపారు. భారతప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఎఫ్ఐఎస్టీ ద్వారా మంజూరైన రూ.1.65 కోట్లతో యూసీఈకే సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎఫ్ఐఎస్టీ సమన్వయకర్త, పరిశోధనాభివృద్ధి డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రవీంద్ర నేతృత్వంలో సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణాలపై భూకంప పరిస్థితులను, మెకానికల్ నిర్మాణాల్లో ప్రకంపనలను అనుకరించే పరికరాలతో కూడిన డైనమిక్ సౌకర్యాలను శ్యామలరావు, వీసీ ప్రసాదరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్లు సుమలత, స్వామినాయుడు, ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, డైరెక్టర్లు సీహెచ్ సాయిబాబు, ఎ.గోపాలకృష్ణ, మురళీకృష్ణ, శ్రీనివాసులు, బాలకృష్ణ, కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ఎస్పీ చర్యలు తీసుకున్నారు.