చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మేనల్లుడు లోకేష్ మృతి
ABN , First Publish Date - 2022-03-05T06:43:48+05:30 IST
216 జాతీయ రహదారి ఐ.పోలవరం మండలం పాత ఇంజరంవద్ద కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ మేనల్లుడు కాటాడి లోకేష్(21) చికిత్స పొందుతూ మృతిచెందినట్టు శుక్రవారం ఉదయం కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు.
ఐ.పోలవరం/ కాకినాడ క్రైం, మార్చి 4: 216 జాతీయ రహదారి ఐ.పోలవరం మండలం పాత ఇంజరంవద్ద కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ మేనల్లుడు కాటాడి లోకేష్(21) చికిత్స పొందుతూ మృతిచెందినట్టు శుక్రవారం ఉదయం కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈనెల 1వ తేదీ మంగళవారం రాత్రి ఎమ్మెల్యే సతీష్కుమార్ తనయుడు పొన్నాడ సుమంత్ మేనల్లుడు కాటాడి లోకేష్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పాత ఇంజరం వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో వారిని మెరుగైన వైద్యంకోసం కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మేనల్లుడు కాటాడి లోకేష్ మృతిచెందాడు. మృతదేహాన్ని జీజీహెచ్ తరలించి పోస్ట్మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే తనయుడు సుమంత్ కోలుకుంటున్నాడు. మృతిచెందిన లోకేష్ తండ్రి రాంబాబు రాజమండ్రి పేపర్మిల్లులో ఉద్యోగం చేస్తున్నారు. లోకేష్ కోయంబత్తూర్లో విద్యనభ్యసిస్తుండగా, ఇలా ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసినట్టు ఎస్ఐ సీహెచ్ రాజేష్ తెలిపారు.