కిక్కిరిసిన శివాలయాలు

ABN , First Publish Date - 2022-11-08T01:05:28+05:30 IST

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు సోమవారం భక్తులతో కిక్కిరిశాయి. శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. పలుచోట్ల ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

కిక్కిరిసిన శివాలయాలు
కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

  • పలుచోట్ల కార్తీక సోమవారం పూజలు

  • శైవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు

  • శివ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు

కొవ్వూరు, నవంబరు 7: కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు సోమవారం భక్తులతో కిక్కిరిశాయి. శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. పలుచోట్ల ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి తీరం కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. వేకుమవాము నుంచి భక్తులు అధికసంఖ్యలో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన స్నానఘట్టంలో శివలింగాలకు నదీ జలాలతో అభిషేకాలు చేశారు. కార్తీక మాసం రెండో సోమవారం, పౌర్ణమి కలిసి రావడంతో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి అరటి డొప్పలలో నేతి దీపాలను నదిలో విడిచారు. క్షేత్రంలోని శివ, కేశవులను, సుందరేశ్వరస్వామిని దర్శించుకుని పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రావిచెట్టు వద్ద నాగశిలలకు నదీ జలాలతో అబిషేకించారు. ప్రధాన స్నానఘట్టం, తులసి చెట్టు, రావిచెట్ల వద్ద సుందరేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేశారు. గోష్పదక్షేత్రం లో సుందరేశ్వరస్వామి ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహించారు. ఆల యార్చకులు మానేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు క్షేత్రానికి చేరుకుని కార్తీక దీపాలను వెలిగించారు. అనంత రం ఉత్సవమూర్తులను క్షేత్రంలో ఊరేగించారు. జ్వాలాతోరణం వెలిగించి ఉత్సవమూర్తులతో పాటు భక్తులు ప్రదక్షిణలు చేశారు. అలాగే మండలంలోని వాడపల్లి, ఆరికిరేవుల, కుమారదేవం, చిడిపి, పెనకనమెట్ట, ధర్మవరం, దొమ్మేరు, వాడపల్లి, మద్దూరు, వేములూరు గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-11-08T01:05:30+05:30 IST