టీడీపీ నాయకులపై సీఎం జగన్ కక్ష సాధింపు
ABN , First Publish Date - 2022-11-12T00:45:46+05:30 IST
సీఎంగా జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ అన్నారు.
కొవ్వూరు, నవంబరు 11: సీఎంగా జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ అన్నారు. శుక్రవారం కొవ్వూరు నుంచి సుమారు 20 కార్లలో ర్యాలీగా నర్సీపట్నం చేరుకుని అయ్యన్నపాత్రుడికి సానుభూతి తెలిపారు. రాష్ట్రం యావత్ అండగా ఆయనకు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు ఇలా ఒక్కొక్కరిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. జగన్మోహనరెడ్డి దిగిపోతే తప్ప రాష్ట్రంలో ఎవ్వరికి మంచి జరగదన్నారు. డాక్టర్ సుధాకర్ నుంచి వరప్రసాద్ శిరో ముండనం, పులివెందులలో యువతిపై హత్యాచారం ఘటన చూస్తే దళితులపై అత్యాచారాలు, భౌతికదాడులకు పాల్పడుతున్నారన్నారు. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం చూస్తుంటే జగన్ దళితులకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతుందన్నారు. స్వాతంత్య్రం అనంతరం బీహార్ తర్వాత దళితులపై అత్యధికంగా దాడులు జరగడం జగన్ పాలనలోనేనని గ్రహించి, దళిత, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యమై జగన్రెడ్డిని గద్దె దింపాలన్నారు. కార్యక్రమంలో బూరుగుపల్లి రాఘవులు, వేగి చిన్నా, ఉప్పులూరి పార్ధసారధి, కోడూరి ప్రసాద్, బోడపాటి కాశీ, ఆత్కూరి రాంబాబు, కరుటూరి సతీష్, పల్లి శ్రీను, చావా శ్రీను పాల్గొన్నారు.