కేశవరం పోతురాజుచెరువులో మట్టి తవ్వకాల అడ్డగింపు
ABN , First Publish Date - 2022-05-16T06:50:34+05:30 IST
కేశవరంలో వున్న గనిపోతురాజు మైనర్ ఇరిగేషన్చెరువు(ట్యాంకు)లో మట్టి తవ్వకాలను స్థానిక రైతులు ఆదివారం అడ్డుకున్నారు.
మండపేట, మే 15: కేశవరంలో వున్న గనిపోతురాజు మైనర్ ఇరిగేషన్చెరువు(ట్యాంకు)లో మట్టి తవ్వకాలను స్థానిక రైతులు ఆదివారం అడ్డుకున్నారు. ఈచెరువులో పూడిక మట్టి తీసేందుకు ఇద్దరకి ఆ శాఖ అనుమతులు మంజూరు చేసింది. అయితే క్యూబిక్మీటరు మట్టి ధర రూ.1గా నిర్ణయించారు. చెరువులో మట్టి పూడిక తీత ముసుగులో మట్టిని ఎక్స్కవేటర్లతో పెద్ద లారీల్లో ఇటుకలు బట్టీలు, నర్సరీలు, లేఅవుట్లకు తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చెరువు మట్టి తీయడం వల్ల తమ పొలాలకు ఇబ్బంది అవుతుందని, తవ్వకాలకు సంబంధించిన అనుమతి పత్రాలు చూపాలని ఒక వర్గం వారు డిమాండ్ చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. మండపేట రూరల్ ఎస్ఐ శివకృష్ణ అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఇరువర్గాలను సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో మట్టి తవ్వకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.