ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు
ABN , First Publish Date - 2022-03-05T05:49:13+05:30 IST
ఆంధ్రరాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మిక సమస్యలపై కాకినాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
భానుగుడి(కాకినాడ),
మార్చి 4: ఆంధ్రరాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్
ఫెడరేషన్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మిక
సమస్యలపై కాకినాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
నూకల బలరామం అధ్యక్షతన దీక్షలు జరిగాయి. మొదటిరోజు కార్యక్రమాన్ని సీఐటీయూ
జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా
శేషుబాబ్జి మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో మున్సిపల్ కార్మికులకు సమాన పనికి
సమాన వేతనం, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని
ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల
రాజ్కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రక్షణ పరికరాలు,
పనిముట్లు సకాలంలో ఇవ్వాలని జీవో నెంబరు 1615 అమలుచేసి పెరిగిన నగర జనాభాకు
అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్
విభాగంలో పని చేసే మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు రూ. 26 వేలు
చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్స్ జిల్లా కన్వీనర్ నూకల
బలరాం మాట్లాడుతూ కార్మికులందరికీ ఆమోదకరమైన 11వ పీఆర్సీ అమలు చేయాలని,
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని లేని పక్షంలో 3 రోజులు
పాటు విజయవాడలో దీక్షలు నిర్వహించి అసెంబ్లీ ముట్టడికి కూడా
వెనుకాడబోమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు,
ఉపాధ్యక్షుడు మేడిశెట్టి వెంకటరమణ, మున్సిపల్ నాయకులు ఎం.శ్రీనివాసరావు,
జి.రమేష్. జి.వెంకటేశ్వర్లు, కె.బాలయోగి తదితరులు పాల్గొన్నారు.