దౌర్భాగ్య ముఖ్యమంత్రి పాలనలో ఉన్నాం
ABN , First Publish Date - 2022-11-25T01:04:29+05:30 IST
రాష్ట్రంలో ప్రజల మధ్యకు రాలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి పాలనలో మనమంతా వున్నామని జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు.
జనసేన ఆత్మీయ సమ్మేళనంలో కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం రూరల్, నవంబరు 24: రాష్ట్రంలో ప్రజల మధ్యకు రాలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి పాలనలో మనమంతా వున్నామని జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు మనీష్ ఫంక్షన్ హాలులో గురువారం జరిగిన రూరల్ జనసేన ఆత్మీయ సదస్సుకు రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ అధ్యక్షుడు అత్తి సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, చెరుకూరి వెంకటరమారావులతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. వైసీపీ నేతలు నోరు పారేసుకోవద్దని, రక్తంతో చేతులు తడిచిన రౌడీలను వైసీపీలో పెట్టుకుని జనసేనపై నిందలు వేయడం సరికాదన్నారు. నేర చరిత్ర ఎవరికి వుందో ఎన్నికల సంఘానికి తెలుసునన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిండు సభలో నిర్వాతులకు పది లక్షలు ఇస్తామని సీఎం హామీ ఇస్తే అంబటి రాంబాబు వచ్చి అబద్ధం చెప్తున్నారని అనడం హాస్యాస్పదంగా వుందన్నారు. ప్రజా క్షేత్రంలో నిలబడిన ఏకైక నాయకుడు పవన్కల్యాణ్ అని, కులరహిత సమాజం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. రూరల్ మండలంలో వచ్చేనెల 3వ వారంలో జనసేన పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నామని దుర్గేష్ అన్నారు.