కోరుకొండ నరసన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

ABN , First Publish Date - 2022-03-14T05:24:54+05:30 IST

చారిత్రాత్మక కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతో అర్చకస్వాములు శ్రీకారం చుట్టారు. ఈ నెల 19వ తేదీ వరకు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో వైఖానస ఆగమ పండితుడు పవన్‌కుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో స్థానిక అర్చకస్వాములు స్వామివారి దేవుని కోనేటి వద్ద గల పుట్ట వద్దకు చేరుకున్నారు.

కోరుకొండ నరసన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ధ్వజారోహణతో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలకు శ్రీకారం చుడుతున్న అర్చకస్వాములు

కోరుకొండ, మార్చి 13: చారిత్రాత్మక కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణతో అర్చకస్వాములు శ్రీకారం చుట్టారు.  ఈ నెల 19వ తేదీ వరకు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో వైఖానస ఆగమ పండితుడు పవన్‌కుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో స్థానిక అర్చకస్వాములు స్వామివారి దేవుని కోనేటి వద్ద గల పుట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ పుట్టకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుట్టమన్ను తీసుకుని దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖ మండపంలో పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ జరిపారు. దిగువ దేవస్థానం ప్రధాన ఆలయం ముందు గల ధ్వజస్తంభంపై ధ్వజ పటాన్ని ఆరోహణ చేశారు. అనంతరం బలిహరణ, సేవాకాలం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ పరాశర రంగరాజభట్టర్‌, ఉత్సవాల ప్రత్యేకాధికారి రమణ, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్‌ కర్రి లక్ష్మీసరోజ, ఎంపీటీసీలు బొరుసు సుబ్బలక్ష్మి, కాళ్ల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-14T05:24:54+05:30 IST