కొడవలి కొండపై సంయుక్త తనిఖీలు
ABN , First Publish Date - 2022-03-04T05:59:59+05:30 IST
గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలోని సర్వే నెంబరు 133/1లోని తురకల కొండ భూములను రెవెన్యూ, మైన్స్, పురావస్తు, సర్వేశాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
మైనింగ్ దరఖాస్తులపై పరిశీలన
గొల్లప్రోలు
రూరల్, మార్చి 3: గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలోని సర్వే నెంబరు
133/1లోని తురకల కొండ భూములను రెవెన్యూ, మైన్స్, పురావస్తు, సర్వేశాఖల
అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ భూముల్లో గ్రావెల్ తవ్వకాల
నిమిత్తం పలువురు దరఖాస్తు చేసుకోగా, అక్కడ మైనింగ్ అనుమతులు ఇవ్వడం తగదని
తాము ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నామని పలువురు సాగుదారులు, బౌద్ధారామాల
దగ్గరలో అనుమతులు ఎలా ఇస్తారంటూ వివిధ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం
చేశారు. ఆందోళనలు నిర్వహించడంతో పాటు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కలెక్టరు జాయింట్ ఇన్స్పెక్షన్కు ఆదేశించారు. కలెక్టరు ఆదేశాల
మేరకు మైన్స్ డిప్యూటీ డైరెక్టరు గోపాలకృష్ణ, పురావస్తుశాఖ అమరావతి
సర్కిల్ సూపరింటెండెంట్ గోపీనాథ్, గొల్లప్రోలు తహశీల్దారు వి.అమ్మాజీ,
సర్వే అధికారి లక్ష్మీనారాయణలు సర్వే 133/1తో పాటు బౌద్ధ ఆరామాలు ఉన్న
కొండను, ఇతర ప్రాంతాలను పరిశీలించారు. వివిధ వర్గాల ప్రజలు నుంచి వచ్చిన
అభ్యంతరాలపై ఆరా తీశారు. తురకల కొండపై తాము మూడు దశాబ్దాలుగా
సాగుచేసుకుంటున్నామని, తమకు పట్టాలు ఇవ్వాలని, మైనింగ్ ప్రతిపాదనలు
విరమించుకోవాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రతినిధులు తదితరులు కోరారు.
కాగా జిల్లా కలెక్టరుకు అన్ని విషయాలతో నివేదిక అందజేస్తామని అధికారులు
తెలిపారు.