వైట్ గోల్డ్ మనదే
ABN , First Publish Date - 2022-05-21T06:54:27+05:30 IST
జీడిపప్పు.. చూస్తేనే నోరూరుతోంది.. ప్రస్తు తం వినియోగం బాగా పెరిగింది..
జీడిపప్పు తయారయ్యేది ఇక్కడే
కోట్లాది రూపాయల వ్యాపారం
80 కేజీల బస్తా రూ.9 వేలు
కేజీ జీడి పప్పు రూ. 700
వేలాది మందికి ఉపాధి
దేవరపల్లి, మే 20 : జీడిపప్పు.. చూస్తేనే నోరూరుతోంది.. ప్రస్తు తం వినియోగం బాగా పెరిగింది..ఏ విందు జరిగినా ప్రతి కూరలో జీడిపప్పు కనబడాల్సిందే. అది ఒక స్టేటస్ సింబల్. అటువంటి జీడిపప్పు ఎక్కడి నుంచి వస్తుందంటే మాత్రం మన ప్రాంతం వారైనా సరే నోరెళ్లబెడతారు.. అస లు జీడిపప్పు తయారీ అంతా మన దేవరపల్లి పరిసర ప్రాం తాల్లోనే సాగుతోంది.ఇక్కడి నుంచే పలు రాష్ర్టాలకు సరఫరా చేస్తారు.ప్రతి ఏడాది కోట్లాది రూపాయల వ్యాపా రం సాగు తోంది.వేలాది మందికి ఉపాధినిస్తోంది. అటువంటి జీడిపప్పు వ్యాపారంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
వేలాది మందికి ఉపాధి
బ్లాక్ గోల్డ్గా పిలువబడే నల్లరాతి క్వారీల పరిశ్రమ తరు వాత వైట్గోల్డ్గా పిలువబడే జీడిపప్పు పరిశ్రమలు దేవరపల్లి చుట్టుపక్కల విరాజిల్లుతున్నాయి. జీడిమామిడి పంట ఏప్రిల్, మే రెండు నెలలు మాత్ర మే వస్తుంది. మన ప్రాంతంలో జీడి తోటలు ఎక్కువగా ఉండటంతో పరి శ్రమ లు విస్తారంగా నిర్మించారు.ఆ రెండు నెలలు జీడిపప్పు సేక రించి ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ప్రతి ఫ్యాక్టరీలో ఏడాదికి సరి పడా జీడిగింజలు నిల్వ ఉంటాయి. నిరంతరం జీడిపప్పు పరిశ్రమ కొనసాగుతోంది.గతంలో జీడి గింజలను కాల్చి కూలీలతో కొట్టించి పప్పు తయారు చేసేవారు. ప్రస్తుతం యంత్రాలు రావడంతో సులభమైపోయింది. బాయిల్ చేసిన జీడి గింజలు బయట కూలీలకు ఇచ్చి కటింగ్ చేయించటం జరుగుతోంది. మహిళలకు రూ.300 నుంచి 500 వరకు కూలీ గిడుతుంది. ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళా కూలీలకు రూ.300, పురుషులకు రూ.600 కూలీ ఇస్తుంటారు. పరిసర ప్రాంతాల్లో చాలా మందికి ఇదే జీవనాధారం.
మన జిల్లాలోనే 70 ఫ్యాక్టరీలు..
దేవరపల్లి,నల్లజర్ల, దూబచర్ల, పుల్లలపాడు, గోపాలపురం, తాడిమళ్ళ, చుక్కాల గ్రామాల్లో జీడిపప్పు ప్యాక్టరీలు 70 వరకు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చవుతోంది. దళారీల ద్వారా రైతుల నుంచి జీడిగింజలు కొనుగోలు చేస్తారు. రైతు వద్ద రూ.9 వేలకు కొనుగోలు చేస్తారు. ఫ్యాక్టరీ వద్ద జీడిగింజల బస్తా (80 కేజీలు) రూ.11 వేలు ధర పలుకుతోంది. ఫ్యాక్ట రీలో ప్రోసెసింగ్ చేసిన తరువాత జీడిపప్పు కేజీ రూ.690, గుళ్లు రూ. 720లకు బయట మార్కెట్లో విక్రయిస్తారు. గతేడాది కేజీ జీడిపప్పు వెయ్యి రూపాయల వరకూ విక్ర యించారు. సీజన్ బట్టి ధరలు కూడా అటూ ఇటూ మారు తుంటాయి.అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం.. దళారీలు మాత్రం రైతుల వద్ద నుంచి ఈ రెండు నెలలో జీడి గింజలు కొనుగోలు చేసి ఉంచుతారు. ఏడాది పొడవునా అవసరమైన జీడిగింజలను కొనుగోలు చేసుకుని గొడౌన్స్లో నిల్వ చేసుకుంటారు. జీడిపప్పు పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల నుంచి 10 వేల మందికి ఉపాధి కలుగు తోంది.ఈ ఏడాది మన ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా జీడి మామిడి పంట 50 శాతం దిగుబడి తగ్గింది. ఎక్కువగా జీడి గింజలు సౌతాఫ్రికా, నైజీరియా, ఇతర దేశాల నుంచి వాడల ద్వారా కర్ణాటక, కేరళ, విశా ఖపట్నం పోర్టుల ద్వారా దిగుమతి చేసుకుంటారు.
పొట్టూ ఉపయోగమే..
జీడిగింజల నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతీది ఉపయోగమే. జీడిపప్పు పొట్టును ఖైనీ, ఇతర ఉత్పత్తుల్లో వాడతారు. తొక్క నుంచి ఆయిల్ తయారు చేస్తారు. ఇవి ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్టు అవుతూ ఉంటాయి. బయట మార్కెట్లో జీడిగుళ్ళు రూ.600 నుంచి రూ.700, జీడిపప్పు బద్దలు రూ.600 - 650 ముక్క, రూ.500 - 600, బాదంగిరి రూ.400 - 500, నూక రూ.100 - 300, పొట్టు కిలో రూ.10, జీడితొక్క కిలో రూ.10లకు విక్రయిస్తారు. జీడి పప్పు ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, పలు ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. ఈ ఫ్యాక్టరీల్లో రోజుకు రూ.50 లక్షల టర్నోవర్ ఉంటుంది. ప్రతి ఏడాది కోట్లలో వ్యాపారం సాగుతోంది.