వినూత్న పరిశోధనల కోసం సమీక్ష
ABN , First Publish Date - 2022-01-22T05:33:22+05:30 IST
వర్సిటీలోని సెనేట్ హాల్లో పరిశోధనాభివృద్ధి డైరెక్టర్ వి.రవీంద్ర అధ్యక్షతన యూసీఈకే ఈసీఈ, సీఎస్ఈ విభాగ అధ్యాపకులతో శుక్రవారం వినూత్న పరిశోధనలకోసం జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు సమీక్షించారు.
జేఎన్టీయూకే, జనవరి 21: వర్సిటీలోని సెనేట్ హాల్లో పరిశోధనాభివృద్ధి డైరెక్టర్ వి.రవీంద్ర అధ్యక్షతన యూసీఈకే ఈసీఈ, సీఎస్ఈ విభాగ అధ్యాపకులతో శుక్రవారం వినూత్న పరిశోధనలకోసం జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు సమీక్షించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పరిశ్రమల సహకారంతో వినూత్న పరిశోధనలు చేయడానికి మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా సైన్స్, ఐఓటీ మొదలైన వాటిలో అధ్యాపకులు తమకు ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకుని పరిశ్రమలతో కలిసి పరిశోధనలు కొనసాగించాలని సూచించారు. ఇటువంటి పరిశోధనలు జరపడానికి టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయని, పరిశ్రమల యాజమాన్యాలు విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధనలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వివరించారు. వర్సిటీలో పరిశోధనలు చేసేవారికి పరిశోధనా నిధులు మంజూరు చేస్తామన్నారు. వర్సిటీలో ఫుల్టైం రీసెర్చ్ స్కాలర్స్ భర్తీకి కృషి చేస్తానని వీసీ హామీ ఇచ్చారు. అధ్యాపకుల పరిశోధనలపై శ్రద్ధ చూపించి నాణ్యమైన విద్యనందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ కేవీ రమణ, రిజిస్ర్టార్ ఎల్.సుమలత, ఇంక్యుబేషన్ సెంటర్ డైరెక్టర్ జేవీఆర్ మూర్తి, యూసీఈకే ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.