ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST
జగనన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ తారాచంద్ అధికారులను ఆదేశించారు.
- హౌసింగ్ పీడీ తారాచంద్
బిక్కవోలు, మే 27: జగనన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ తారాచంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన బిక్కవోలులోని రెండు లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లేఅవుట్-1లో 730 ఇళ్లు మంజూరు చేయగా 680 ఇళ్లు ప్రారంభించారని, ఇందులో 130 పూర్తయ్యాయని ఏఈ వెంకటరామారెడ్డి ఆయనకు తెలిపారు. లేఅవుట్-2లో అప్రోచ్ రోడ్ లేకపోవడంతో ఇళ్లు ప్రారంభించలేదన్నారు. అయితే ఇటీవల రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు కాగా పనులు ప్రారంభించామని, దీంతో ఐదుగురు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారని తెలిపారు. లబ్ధిదారులతో పీడీ మాట్లాడుతూ వర్షాకాలం వచ్చే లోగా అందరూ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇసుక, సిమెంటు ఇస్తోందని, అర్హులైన వారికి డీఆర్డీఏ వారు రూ.35 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారని, వేగంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం సిమెంటు గౌడౌన్ను పరిశీలించి స్టాక్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈయన వెంట హౌసింగ్ సిబ్బంది వున్నారు.