ప్రియుడి మోజులోపడి భర్త హత్య
ABN , First Publish Date - 2022-09-17T06:04:14+05:30 IST
ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలి అనుకుంది. ప్రియుడు సహకరించడంతో భర్తను హత్య చేసి గుండెపోటుగా అందర్నీ నమ్మించింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
కె.గంగవరం, సెప్టెంబరు 16: ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలి అనుకుంది. ప్రియుడు సహకరించడంతో భర్తను హత్య చేసి గుండెపోటుగా అందర్నీ నమ్మించింది. మూడు నెలల తరువాత ఆమె ప్రియుడుతో దొరికిపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం బాలాంతరంలో జరిగిన ఈ సంఘటనపై శుక్రవారం పామర్రు ఎస్ఐ కె.చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం... బాలాంతరానికి చెందిన కోలా సుబ్బారావు(42) సత్యవీరవెంకటలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె ఉంది. సుబ్బారావు వ్యవసాయ కూలీ. అయితే వీరి జీవితంలోకి అదే గ్రామానికి చెందిన ఉలిసి శ్రీనివాస్(28) ప్రవేశించాడు. వెంకటలక్ష్మి, శ్రీనివాస్ మధ్య వివాహేతర సంబంధం బలపడింది. అడ్డుగా ఉన్న భర్తను తొలగించేందుకు వెంకటలక్ష్మి ప్రియుడితో కలిసి పథకం రచించింది. మే ఒకటో తేదీన ఆహారంలో మత్తుబిల్లలు కలిపి సుబ్బారావును మత్తులోకి పంపించారు. ఊపిరాడకుండా చేసి చంపేశారు. తన భర్త గుండెపోటుతో మరణించాడని వెంకటలక్ష్మి అందర్నీ నమ్మించింది. అప్పటివరకు ఆమెపై ఎటువంటి అనుమానాలు రాలేదు. సుబ్బారావు మృతదేహానికి దహన సంస్కారాలు జరిపించారు. అప్పటినుంచి శ్రీనివాస్ ఊరికి దూరంగా ఉన్నా డు. వెంకటలక్ష్మి కాజులూరు మండలంలోని ఉప్పుమిల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అంతా సద్దుమణిగిన తరువాత సెప్టెంబరు ఒకటో తేదీన వీరు వేరువేరుగా గ్రామాలకు చేరుకున్నారు. ఈనెల 6న వీరు ఇద్దరూ ఒక గదిలో ఉండగా బంధువులు పట్టుకోవడంతో వీరి వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో సుబ్బారావు గుండెపోటుతో మరణించలేదని బంధువులకు అనుమానం వచ్చింది. మృతుడి తమ్ముడు వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వి.శ్రీనివాస్, ఎస్ఐ చిరంజీవిలు బాలంతరంలో సుబ్బారావు ఇంటిని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్ఐలు తెలిపారు.