హైవే విస్తరణకు అమలాపురంలో సర్వే
ABN , First Publish Date - 2022-04-24T07:11:36+05:30 IST
216 జాతీయ రహదారి ఆధునికీకరణ లో భాగంగా రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు సర్వే చేపడుతు న్నారు.
11 బృందాలతో సర్వే.. పరిశీలించిన ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్
అమలాపురం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): 216 జాతీయ రహదారి ఆధునికీకరణ లో భాగంగా రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు సర్వే చేపడుతు న్నారు. అమలాపురం ఆర్డీవో ఎన్ఎస్వీబీ వసంతరాయుడు, తహశీల్దార్ గెడ్డం రవీంద్రనాథ్ఠాగూర్, మున్సిపల్ కమిషనర్ వి.అయ్యప్పనాయుడుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 11 బృందాలు శుక్రవారం నుంచి విస్తృతంగా సర్వే చేపడుతున్నాయి. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి నుంచి 216 జాతీయ పాత రహదారిని వైజంక్షన్ వరకు విస్తరణ కోసం బృందాలు పనిచేస్తున్నాయి. ఎఫ్ఎంబీ రికార్డుల ఆధారంగా భట్నవిల్లి నుంచి సర్వే కొనసాగిస్తున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణల తొలగింపుకోసం ఈ సర్వే చేపట్టారు. భట్నవిల్లి, ఎర్రవంతెన, శ్రీవేంకటే శ్వరస్వామి గుడి, మహిపాలవీధి, ముమ్మిడివరం గేటు సెంటర్ మీదుగా హైస్కూ లు సెంటర్, ఎస్కేబీఆర్ కళాశాల మీదుగా వైజంక్షన్ వరకు ఏఏ ప్రాంతాల్లో భూ ములు ఆక్రమణకు గురయ్యాయో గుర్తించి మార్కింగ్ ఇస్తారు. పట్టణాల్లో ఇటీ వల ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో రికార్డుల ఆధారంగా ఆక్రమణలు గుర్తించి తొలగిస్తారనడంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. సర్వే ప్రక్రియను ఆర్డీవో వసంతరాయుడు, కమిషనర్ అయ్యప్పనాయుడు పరిశీలించారు.