గుట్కా రవాణాకు.. చెక్ పడేనా..?
ABN , First Publish Date - 2022-09-20T07:02:56+05:30 IST
రాష్ట్రంలో గుట్కాను నిషేధించినా యథేచ్ఛగా లభ్యమవు తోంది. అక్రమంగా సాగుతున్న ఈ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గుట్కా రాకెట్ ఆట కట్టించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. గుట్కా అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టే బాధ్యతను సెబ్ పరిధిలోకి తెచ్చింది.
- సెబ్కు విస్తృతాధికారాలు... త్వరలో ఉత్తర్వులు
- ఇతర రాష్ర్టాలతోనూ సమస్వయం సులభం
తుని, సెప్టెంబరు 19: రాష్ట్రంలో గుట్కాను నిషేధించినా యథేచ్ఛగా లభ్యమవు తోంది. అక్రమంగా సాగుతున్న ఈ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. గుట్కా రాకెట్ ఆట కట్టించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. గుట్కా అక్రమ రవాణా, అమ్మకాలను అరికట్టే బాధ్యతను సెబ్ పరిధిలోకి తెచ్చింది. రాష్ట్రంలో గంజాయి, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సెబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సెబ్ పరిధిని విస్తరిస్తూ గుట్కా దందా ఆటకట్టించే బాధ్యతను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
సెబ్తో అక్రమాలు ఆగేనా..
అక్రమాలకు అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం సెబ్ ఏర్పాటు చేసినప్పటికీ జిల్లా అక్రమ మద్యం, ఇసుక, గంజాయి అక్రమ రవాణా యథావిధిగా సా గుతోంది. మద్యం విక్రయాల్లో ప్రభుత్వ దుకాణాలకు వస్తున్న మంచి బ్రాం డ్లను బెల్ట్ దుకాణాల నిర్వాహకులకు బాటిల్పై రూ.10 అదనంగా వేసుకుని దుకా ణం మూసివేసే సమయాల్లో బ్లాక్ అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దీనికి స్థానిక ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో తుని, పాయకరావుపేట, ప్రత్తిపాడు, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో బెల్ట్ దుకాణాల్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుట్కా దందాపై ఉక్కుపాదం మోపాలంటూ సెబ్కు ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. గుట్కా దందాల్లో ఎమ్మెల్యేల అండదండలతో జరుగుతున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్టవేయాలంటే సెబ్అధికారులకు కత్తిమీద సాములా ఉంటుందని కొందరు అంటున్నారు.
ఇతర రాష్ర్టాలను దాటుకుని..
గుట్కా ప్రధానంగా ఒడిశా, కర్ణాటకా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలనుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా తెస్తున్నారు. స్థానిక పోలీసులు కొన్నిచోట్ల మెరుపుదాడులు చేసి మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారన్నది బహిరంగంగా చర్చ జరుగుతోంది. జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక కారణాలతో నిందితులు బెయిల్ పొందుతూ తప్పించుకుంటున్నారు. కేసుల దర్యాప్తులో కూడా కాలయాపన జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గుట్కా దందాను అరికట్టాలని సెబ్కు అప్పగించడం మంచిదేనని, సెబ్లో విధులు నిర్వహించే అధికారులను మాత్రం సమర్థవంతులను నియమిస్తే తప్ప ఈ దందాను అరికట్టడం ఎవ్వరితరం కాదని పలువురు అంటున్నారు. స్థానిక పోలీసులతోను, ఇతర రాష్ర్టాల పోలీసులతోను సమన్వయం చేసుకునే అవకాశం సెబ్కు ఉంటుంది. అందువల్ల సెబ్ అధికారులు ఎంతవరకూ ఈ అక్రమవ్యాపారాలను అరికడతారో వేచి చూడాల్సి ఉంది.