18 ఏళ్లు నిండిన యువత రేపటిలోగా ఓటుహక్కు పొందాలి
ABN , First Publish Date - 2022-12-07T01:49:19+05:30 IST
ఈనెల 8వ తేదీలోపు 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీయువకులంతా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) : ఈనెల 8వ తేదీలోపు 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీయువకులంతా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా తమ ఓటు నమోదు, ఓటు తొలగింపు, మార్పు కోసం ఆన్లైన్లోని ఎన్వీఎస్పీ పోర్టల్ అండ్ వీహెచ్ఏ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆఫ్లైన్లోని బీఎల్వోద్వారాగానీ, తహశీల్దార్ ఆఫీసులో ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 3, 4 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా 18 నుంచి 19 ఏళ్ల యువత 4407 మంది, 19 ఏళ్లు దాటినవారు 3281 మంది, మొత్తం 7688 మంది ఓటుహక్కు కోసం నమోదు చేసుకున్నారని, నవంబరు 9 నుంచి ఈనెల 5వ తేదీ వరకూ 17,854 మంది ఓటుహక్కు నమోదు చేసుకున్నారని తెలిపారు.