ఎట్టకేలకు కొత్త భవనంలోకి..
ABN , First Publish Date - 2022-07-02T06:46:51+05:30 IST
‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో ఎట్టకేలకు రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం నూతన భవనంలోకి మార్పు చేశారు.

- రాజవొమ్మంగి జూనియర్ కళాశాల భవనానికి మోక్షం
- ‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
రాజవొమ్మంగి, జూలై 1: ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో ఎట్టకేలకు రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం నూతన భవనంలోకి మార్పు చేశారు. ఈ జూనియర్ కళాశాలలో ప్రతి ఏటా ఐదు గ్రూపులలో సుమారు 400 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతారు. కళాశాలకు 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలతో నిర్మించిన నూతన కళాశాల భవనం ఉన్నప్పటికీ పైకప్పు పగిలిన రేకుల షెడ్లోనే కళాశాల తరగతులు నిర్వహిస్తున్నారు. బిల్డింగ్ తమకు అప్పగించలేదంటూ కళాశాల సిబ్బంది, ఎప్పుడో హ్యండోవర్ చేశామని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ అధికారులు వాదించుకోవడంతో ఐదేళ్లుగా ఈ కొత్త భవనం వృథాగా ఉండిపోయింది. దీంతో మందుబాబులు కళాశాల భవనాన్ని అడ్డాగా చేసుకోగా, దొంగలు కళాశాల తలుపులు, ఫ్యాన్లు ఎత్తుకుపోయారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. ‘ఏంటో.. నిర్లక్ష్యం’ శీర్షిన వచ్చిన కథనానికి స్పందించి డీవీఈవో సుబ్రహ్మణ్యం కళాశాల భవనాన్ని చూసి రికార్డులు పరిశీలించడంతో 2018లో అప్పటి ప్రిన్సిపాల్ హ్యండ్ ఓవర్ చేసుకున్నట్టు తేలింది. తక్షణం భవనానికి మరమ్మతులు చేయించి కళాశాలను నూతన భవనంలోకి మార్చాలని ఆయన ఆదేశించారు. అలాగే ఆంధ్రజ్యోతి కథనంతో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సందర్శించి అధి కారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఇబ్బం దులకు గురవుతున్నారని, నూతన భవనంలోకి కళాశాలను మార్పుచేయకపోతే విద్యార్థులతో తాము నూతన భవనాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ వరుస పరిణామాలతో అధికారులు స్పందించి శుక్రవారం కళాశాల పున:ప్రారంభించారు. అలాగే నూతన భవనానికి కళాశాల టేబుళ్లు, కుర్చీలు, సామగ్రి మార్పుచేశారు. అలానే శుక్రవారం నుం చే జూనియర్ కళాశాల తరగతులు, అడ్మిషన్లు స్థానిక తహశీల్దార్ కార్యల య సమీపంలోని నూతన భవనంలోనే జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ మదినా తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనాల వల్లే ఇన్నేళ్ల నాటి సమస్య పరిష్కారమైందని గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు.