పల్లపు ప్రాంతాలు జలమయం

ABN , First Publish Date - 2022-09-10T06:48:56+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెడపి లేకుండా వర్షం కురిసింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.

పల్లపు ప్రాంతాలు జలమయం

పెరవలి/కొవ్వూరు/గోపాలపురం/దేవరపల్లి/ఉండ్రాజవరం, సెప్టెంబరు 9: తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెడపి లేకుండా వర్షం కురిసింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లోని పల్లపు ప్రాంతాల్లో  నీరు నిలిచింది. కూరగాయలు, పూల తోటల్లో కూడా నీరు నిలిచింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వార్తలు వస్తుండడంతో ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరు పట్టణంలో భారీవర్షం కురిసింది. పట్టణ, మండలంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పట్టణంలోని జైన్‌ మందిరం వద్ద మెయిన్‌రోడ్‌పై, రూరల్‌ పోలీస్టేషన్‌, జూనియర్‌ కాలేజ్‌ వద్ద, అగ్నిమాపక శాఖ కార్యాలయ ప్రాంగణం, పట్టణ పోలీస్టేషన్‌ వెళ్లే మార్గంలో వర్షపు నీరు నిలిచి వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులకు గురయ్యారు. గోపాలపురం మండలంలో ప్రధాన రహ దారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. శుక్ర వారం జరిగే వారపుసంత కొనుగోలుదారులు లేక వెలవెలబోయింది.  దేవర పల్లిలో హైస్కూల్‌కు వెళ్లే రహదారిలో మురుగునీరు ఉండడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొన్నారు. గ్రామాల్లో రోడ్లు చిత్తడిగా మారాయి. ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు చేరడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. తాడిపర్రు-ఉండ్రాజవరం రోడ్డులోను, దమ్మెన్ను-ఉండ్రాజవరం రోడ్డులో పడిన గోతుల్లో నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2022-09-10T06:48:56+05:30 IST