డొక్కా సీతమ్మ సేవలు చిరస్మరణీయం
ABN , First Publish Date - 2022-02-07T05:58:54+05:30 IST
భావితరాలకు మహోన్నత వ్యక్తుల చరిత్రను అందించడం ద్వారా యువతను సన్మార్గంలో నడిపించవచ్చునని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇన్చార్జి చైర్మన్ ఏవీ రమణారెడ్డి అన్నారు.
పి.గన్నవరం, ఫిబ్రవరి 6: భావితరాలకు మహోన్నత వ్యక్తుల చరిత్రను అందించడం ద్వారా యువతను సన్మార్గంలో నడిపించవచ్చునని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇన్చార్జి చైర్మన్ ఏవీ రమణారెడ్డి అన్నారు. లంకలగన్నవరంలో డొక్కా సీతమ్మ నివాసాన్ని ఆదివారం ఆయన సందర్శించి అనంతరం మాట్లాడారు. అపర అన్నపూర్ణగా ప్రసిద్ధిచెందిన డొక్కా సీతమ్మ అనాడు ఎందరో నిరుపేదల ఆకలి తీర్చిందన్నారు. అలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని చెప్పారు. నేటి తరం డొక్కా సీతమ్మను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని కోరారు. బోర్డు సభ్యులంతా కోనసీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఈ ప్రాంతంలో చరిత్ర కలిగిన ప్రదేశాలను సందర్శించారని తెలిపారు. కోనసీమ ప్రాంతం ఎంతో సుందరంగా ఉందని చెప్పారు. ఇక్కడ ప్రకృతి అందాలు కట్టిపడేశాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు ఆసక్తికరంగా ఉన్నాయని అన్నారు. అనంతరం పి.గన్నవరం అక్విడెక్టులో తొట్టెకాలువ, గోదావరి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. తొలుత సీతమ్మ నివాసంలో ఆమె వాడిన వస్తువులను, ఆమె వంశీయుల చరిత్రను తెలుసుకున్నారు. అనంతరం సీతమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట ఏపీపీఎస్సీ సభ్యుడు డాక్టర్ జీవీ సుధాకర్రెడ్డి, వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ కొవ్వూరి త్రినాథరెడ్డి, వైసీపీ జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ ఎస్.శ్రీనివాస్, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు చొల్లంగి సత్తిబాబు ఉన్నారు.