డయల్ యువర్ డీఎంలో దివ్యాంగుల సమస్యలు ప్రస్తావన
ABN , First Publish Date - 2022-11-24T01:02:07+05:30 IST
రాజమహేంద్రవరం ఆర్టీసీ డీఎం షబ్నం బుధవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు వివిధ సమస్యలు ప్రస్తావించారు.
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 23 : రాజమహేంద్రవరం ఆర్టీసీ డీఎం షబ్నం బుధవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు వివిధ సమస్యలు ప్రస్తావించారు. దివ్యాంగులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కొంతసేపు బస్సును ఆపి తర్వాత పోనివ్వాలని, బస్సు ఎక్కినప్పుడు దివ్యాంగుల సీట్లు వారికే కేటాయించాలని, బస్స్టేషన్లలో దివ్యాంగులకు అనువుగా వెస్ట్రన్ టైపు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని పీహెచ్సీ రెసిడెంట్ అసోసియేషన్ తరపున రాజమహేంద్రవరానికి చెందిన పి.నూకరాజు సూచించారు. దీనిపై డీఎం షబ్నమ్ బదులిస్తూ ఈ విషయాలు నోటీస్ బోర్డులో పెట్టడంతోపాటు సమావేశంలో సిబ్బందికి తగిన అవగాహన కల్పిస్తామని, వెస్ట్రన్ టాయిలెట్ల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు ప్రపోజల్ పెడతామని అన్నారు. అలాగే, కొంకుదురుకు చెందిన రాము అనే వ్యక్తి రాజమహేంద్రవరం నుంచి కొంకుదురు బస్సు రెగ్యులర్గా తిప్పాలని కోరగా, తప్పనిసరిగా తిప్పుతామని బదులిచ్చారు. శ్రీను, ఛార్లెస్ డ్రైవింగ్ స్కూల్ వివరాలు గురించి అడగ్గా పూర్తి వివరాలు చెప్పడం జరిగిందని డీఎం షబ్నమ్ తెలిపారు.