సిమెంట్ తూరలు తొలగించండి
ABN , First Publish Date - 2022-09-13T06:29:31+05:30 IST
ముంగండ, పోతవరం పరిధిలోని వరి పొలాలకు ఇబ్బంది కల్గించేలా మార్కెట్ సమీపంలో డ్రైన్కు ఏర్పాటుచేసిన సిమెంట్ తూరలను రెండు రోజుల్లో తొలగించాలని జిల్లా పంచాయతీ అధికారిణి వి.కృష్ణకుమారి ఆదేశించారు.
పి.గన్నవరం, సెప్టెంబరు 12: ముంగండ, పోతవరం పరిధిలోని వరి పొలాలకు ఇబ్బంది కల్గించేలా మార్కెట్ సమీపంలో డ్రైన్కు ఏర్పాటుచేసిన సిమెంట్ తూరలను రెండు రోజుల్లో తొలగించాలని జిల్లా పంచాయతీ అధికారిణి వి.కృష్ణకుమారి ఆదేశించారు. ముంగండ ప్రధాన రహదారి చెంతనే ఉన్న డ్రైన్కు మార్కెట్ వద్ద పంచాయతీ తూరలు ఏర్పాటు చేయడంతో వరి పొలాల్లో మిగులు నీరు క్రిందకు వెళ్లక చేలు నీట మునుగుతున్నాయని స్పందనలో రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ ఆదేశాలతో తూరలను పరిశీలించి అనంతరం ఆమె మాట్లాడారు. మార్కెట్కు ఇబ్బందులు వస్తే తూరలు స్థానే గోడలు ఏర్పాటుచేసి బల్లలు వేసుకోవాలని రైతులను మాత్రం ఇబ్బంది పెట్టవద్దని ఆమె సూచించారు. ముంగండ, పోతవరం కార్యదర్శులు డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించి నివేదిక అందిచాలని ఆమె ఆదేశించారు. నీటమునిగిన వరిచేలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారిణి వై.ఆనందకుమారి మాట్లాడుతూ ప్రస్తుతం నీట మునిగిన వరిచేలు పనికిరావన్నారు. నీరు క్రిందకు దిగితేతప్ప రైతుల సమస్య పరిష్కారం కాదన్నారు. రెవెన్యూ డ్రైన్లు మూసివేస్తే ఆక్రమణలు తొలగిస్తామని తహశీల్దార్ జీఆర్ ఠాగూర్ హెచ్చరించారు. వారితో పాటు కార్యదర్శులు జి.కుమార్, జి.లక్ష్మీనారాయణ, వీఆర్వోలు నరసింహ, తులసీరావు, దొరబాబు తదితరులు ఉన్నారు.