ఇళ్లిస్తారా.. ఇవ్వరా!?

ABN , First Publish Date - 2022-06-10T05:34:14+05:30 IST

ఇంకేముంది ఇళ్లు వచ్చేస్తున్నాయ్‌.. అంటూ పేదలు ఆనందపడ్డారు.

ఇళ్లిస్తారా.. ఇవ్వరా!?
నిడదవోలులో మౌలిక సదుపాయాలు కరువైన టిడ్కో గృహ సముదాయం

నిడదవోలులో 1152 టిడ్కో గృహాల నిర్మాణం

మూడేళ్లుగా పేదల ఎదురుచూపు

నేటికీ కనికరించని ప్రభుత్వం 

వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు సతమతం


నిడదవోలు, జూన్‌ 9 : ఇంకేముంది ఇళ్లు వచ్చేస్తున్నాయ్‌.. అంటూ పేదలు ఆనందపడ్డారు. అనుకున్నట్టుగానే గృహ నిర్మాణాలు భారీగా సాగాయి.. అను కున్నదానికంటే ముందే గృహాలు ఇచ్చేస్తారని అంతా ఆశించారు. చాలా మంది అప్పులు చేసి మరీ డిపాజిట్లు చెల్లించారు.. తీరా చూస్తే ప్రభుత్వం మారింది..  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. మూడేళ్లుగా ఇల్లు కలగా మిగిలి పోయింది. నేటికీ ఇళ్లెప్పుడిస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదల సొంతింటి కల నెర వేర్చేందుకు టిడ్కో గృహ సముదాయాలకు శ్రీకారం చుట్టారు. నిడదవోలు పట్టణంలోని తీరుగూడెం సమీపంలో 13.16 ఎకరాల్లో 1152 మంది లబ్ధి దారులకు గృహాలు అందించేందుకు నిర్మాణాలు ప్రారంభించారు. ఈలోగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తయిన గృహాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన నిలిచిపోయింది. మరో పక్క 96 మంది లబ్ధిదా రులకు సంబంధించి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా మౌలిక వసతులు నేటికి కల్పించక పోవడంతో డబ్బులు కట్టిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అసలు తమకు కేటాయించిన గృహాలు ఈ ప్రభుత్వం ఇస్తుందో లేదో అని   లబ్ధిదా రులు సందేహ పడుతున్నారు. ఎందుకంటే నేటికీ టీడీపీ ప్రభుత్వంలో చేసిన పనులే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఇటుకా మార్చలేదు. కేవలం పూర్తయిన భవనాలకు రంగులు వేసి వదిలేసింది. 300 ఎస్‌ఎఫ్‌టీకి 384 మంది లబ్ధిదారులు  రూ. 500 చొప్పున చెల్లించారు. 365 ఎస్‌ఎఫ్‌టీకి 240 మంది లబ్ధిదారులు రూ.50 వేలు చొప్పున, 430 ఎస్‌ఎఫ్‌టీకి 528 మంది లబ్ధిదారులు రూ. లక్ష చొప్పున చెల్లించారు. వీరిలో 251 మందికి మాత్రమే బ్యాంకుల ద్వారా 50 శాతం రుణం మంజూరుకు అనుమతులు లభించాయి. మౌలిక సదుపా యాల కల్పన లేనందున బ్యాంకులు రుణం మంజూరు చేయలేదు. రూ. లక్ష చొప్పున డిపాజిట్‌ చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి రూ. లక్ష చెల్లించామని ఇళ్లివ్వకపోవడంతో అటు అద్దెలు కట్టలేక.. వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పం దించి ఇళ్లివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-06-10T05:34:14+05:30 IST