ఆదివాసీ యోధుల స్ఫూర్తితో ముందుకెళ్లాలి
ABN , First Publish Date - 2022-11-23T00:48:07+05:30 IST
భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఆదివాసీ సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు పిలుపునిచ్చారు.
దివాన్చెరువు, నవంబరు 22 భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఆదివాసీ సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు పిలుపునిచ్చారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్సీ,ఎస్టీ), ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా విద్యా కళాశాల ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనవీరులు అనే అంశంపై మంగళవారం నన్నయ వర్సిటీలో జాతీయ సెమినార్ నిర్వహించింది. ఈ సెమినార్లో వీసీ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన అనేక నిరసనలకు ఆదివాసీ వీరులు నాయకత్వం వహించారని అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో విశిష్ట అతిథిగా హాజరైన జాతీయ ఆదివాసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ రూప్నారాయణ్ జి. మంద్వే మాట్లాడుతూ నన్నయ విశ్వవిద్యాలయంలో మ్యూజియం ఏర్పాటుకు న్యూఢిల్లీలోని ఎన్సీఎస్టీకి ప్రతిపాదించి కృషి చేస్తానని చెప్పారు. సంస్కృతికి మూలం ఆదివాసీలేనని అంటూ ఆదివాసీల చరిత్ర సాంస్కృతిక విషయాలను వివరించారు. ఎందరో విదేశీయులుపై ఆదివాసీలు పోరాటాలు చేశారన్నారు. చారిత్రక అంశాలను అవగాహన చేసుకుంటూ భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. విద్యార్ధులు ప్రదర్శించిన గిరిజన, జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్యఅశోక్, కన్వీనర్ ఆర్ఎస్. వరహాల దొర, ప్రిన్సి పాల్ కె.సుబ్బారావు, అధ్యాపకులు పి.విజయనిర్మల, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు, కోకన్వీనర్లు మధుకుమార్, రాజ్కుమార్, కృష్ణ పాల్గొన్నారు.