టీటీడీ ఉద్యోగ సంఘ నేతను దుర్భాషలాడిన వైసీపీ నేత

ABN , First Publish Date - 2022-01-26T07:28:48+05:30 IST

తనను ఓ వైసీపీ నాయకుడు దుర్భాషలాడారంటూ టీటీడీ ఉద్యోగ సంఘ నేత ఒకరు ఆరోపిస్తూ.. మంగళవారం ఉద్యోగులతో కలిసి తిరుపతిలోని మహతి ఆడిటోరియం వద్ద నిరసనకు దిగారు.

టీటీడీ ఉద్యోగ సంఘ నేతను దుర్భాషలాడిన వైసీపీ నేత
నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

తిరుపతిలోని మహతి ఆడిటోరియం వద్ద నిరసనకు దిగిన ఉద్యోగులు


తిరుపతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తనను ఓ వైసీపీ నాయకుడు దుర్భాషలాడారంటూ టీటీడీ ఉద్యోగ సంఘ నేత ఒకరు ఆరోపిస్తూ.. మంగళవారం ఉద్యోగులతో కలిసి తిరుపతిలోని మహతి ఆడిటోరియం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితుడు, ఉద్యోగులు తెలిపిన వివరాల మేరకు.. గత ఏడాది ఏప్రిల్‌లో తిరుపతి ఎస్వీ హైస్కూల్‌ క్రీడా మైదానంలో టీటీడీ ఉద్యోగులు క్రికెట్‌ ఆడుకోవటానికి ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. అవసరమైన ఏర్పాట్లు చేయమని మహతి ఆడిటోరియం ఇన్‌చార్జిగా ఉన్న ఏఈ వంశీకృష్ణకు ఆదేశాలిచ్చారు. పనులు ఇప్పటి వరకు జరగకపోవడంతో మంగళవారం టీటీడీ ఉద్యోగ సంఘ నేతలు వంశీకృష్ణకు ఫోన్‌ చేశారు. ఆయన్నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో.. ఇది తగదని హితవు పలికారు. కాసేపటికి టీటీడీ ఉద్యోగ సంఘ నేత చీర్ల కిరణ్‌కు ఏఈ బంధువైన వైసీపీ నేత శంకర్‌ యాదవ్‌ ఫోన్‌చేసి.. తీవ్ర పదజాలంతో దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. విషయం తెలిసి.. కిరణ్‌ పక్కనే ఉన్నవారు ఫోన్‌ తీసుకుంటే.. వారిని కూడా తిట్టాడు. పైగా తనకు ప్రజాప్రతినిధుల అండ ఉందని బెదిరించాడు. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగ సంఘ నేతలు పలువురు ఉద్యోగులతో కలిసి మహతికి చేరుకున్నారు. తమను వైసీపీ నేతతో తిట్టించిన వంశీకృష్ణను బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సంబంధిత ఏరియా టీటీడీ ఇంజనీరింగ్‌ అధికారి ఆందోళనకారులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి.. వంశీకృష్ణను బదిలీ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. 

Updated Date - 2022-01-26T07:28:48+05:30 IST