అక్టోబరు 1 నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు
ABN , First Publish Date - 2022-07-21T07:11:28+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదలైంది.
వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తికానున్న విఠపు, యండవల్లి పదవీకాలం
చిత్తూరు కలెక్టరేట్, జూలై 20: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు ఒకటో తేది నుంచి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2019 అక్టోబరు 31వ తేది నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారే ఓటరుగా నమోదుకు అర్హులు. పట్టభద్రులైతే డిగ్రీ మార్కుల జాబితా, ఉపాధ్యాయులైతే ప్రధానోపాధ్యాయుడు ఇచ్చే సర్టిఫికెట్ను ఓటరు నమోదు దరఖాస్తుకు జత చేయాలి. ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్లు ఫారం-18, ఉపాధ్యాయులు ఫారం-19 అందజేయాలి. ఓటర్లుగా చేరేందుకు కలెక్టరేట్, తహసీల్దారు కార్యాలయాల్లో, ఆన్లైన్లో లేదా బీఎల్వోల వద్ద నమోదు చేసుకోవచ్చు. వీటి స్వీకరణకు నవంబరు 7వ తేది వరకు గడువు ఉంటుంది. నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. ఆ రోజు నుంచి డిసెంబరు 9వ తేది వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు.
2017లో ఓటర్లు
ఉమ్మడి 3 జిల్లాల్లో గ్రాడ్యుయేట్ స్థానానికి 1,99,100 మంది, ఉపాధ్యాయ స్థానానికి 16,988 మంది ఓటర్లు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ స్థానానికి 63,248 మంది (పురుషులు 40,949, మహిళలు 21,910 మంది, ఇతరులు 389) ఉన్నారు. ఉపాధ్యాయ స్థానానికి 7314 మంది (పురుషులు 4515, మహిళలు 2799, ఇతరులు 15 మంది) ఓటర్లున్నారు.
మార్చిలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు
చిత్తూరు- నెల్లూరు- ప్రకాశం నియోజకవర్గాల ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రహ్మణ్యం 2017లో ఎన్నికయ్యారు. వీరి ఆరేళ్ల పదవీ కాలం 2023 మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో మార్చి నెలాఖరులోగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అప్పుడే ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు టీచర్లు, పట్టభద్రుల్లో కలకలం ప్రారంభమైంది. ఎన్నికల్లో తాము పోటీచేస్తున్నామంటూ అప్పుడే అభ్యర్థులు ప్రచారాలూ ప్రారంభించారు.