పుత్తూరు రైల్వే స్టేషన్‌కు కోతలేని కరెంటు

ABN , First Publish Date - 2022-04-24T08:48:32+05:30 IST

భగభగమండే సూర్యకాంతినే కరెంటుగా మార్చుకుంది పుత్తూరు రైల్వేస్టేషన్‌.

పుత్తూరు రైల్వే స్టేషన్‌కు కోతలేని కరెంటు
స్టేషన్‌ భవనంపై సోలార్‌ ప్లాంటు - విద్యుత్‌ నిల్వ కోసం బ్యాటరీలు

పుత్తూరు, ఏప్రిల్‌ 23: వాళ్లకి కరెంటు కోతల ఆందోళన లేదు. ఉక్కపోతల చిరాకు లేదు. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. భగభగమండే సూర్యకాంతినే కరెంటుగా మార్చుకుంది పుత్తూరు రైల్వేస్టేషన్‌.సొంతంగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంది.రాష్ట్ర విద్యుత్‌ సంస్థ గ్రిడ్‌తో సం బంధం లేకుండా పుత్తూరులోని రైల్వేస్టేషన్‌,పీడబ్ల్యూ డీ కార్యాలయాలకు సోలార్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. స్టేషన్‌ భవనం మీద రూ.పది లక్షల వ్యయంతో 15 సోలార్‌ప్లేట్లను ఏర్పాటు చేసుకుని 5కిలోవాట్ల విద్యు త్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ నిల్వ కోసం తగిన సామర్ధ్యం కలిగిన బ్యాటరీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు కార్యాలయాలకు కలిపి నెలకు దాదాపు మూడు వేల యూనిట్లు ఖర్చవుతున్నాయి.దాదాపు 35 వేల రూపాయల బిల్లులను రాష్గ్ర విద్యుత్‌ సంస్ధకు చెల్లిస్తున్నారు. ఇప్పుడా ఖర్చు లేదు. పైగా రాష్ట్ర విద్యుత్‌ కోతల నుంచి ఈ స్టేషన్‌ తప్పించుకుంది.స్టేషన్‌, కార్యాలయాలలో తక్కువ వినియోగం కలిగిన ఎల్‌ఈడీ బల్బులను అమర్చుకుని విద్యుత్‌ వాడకాన్ని నియంత్రించుకున్నామని  స్టేషన్‌ అధికారి శ్రీనివాసులు తెలిపారు.  

Updated Date - 2022-04-24T08:48:32+05:30 IST