భక్తులతో తిరుమల కిటకిట
ABN , First Publish Date - 2022-05-21T07:58:47+05:30 IST
తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది.
కొండపై పెరిగిన వారాంతపు రద్దీ
శ్రీవారి సర్వదర్శనానికి 17 గంటల సమయం
తిరుమల, మే 20 (ఆంధ్రజ్యోతి): తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతం కావడంతో శుక్రవారం రాత్రి నుంచే భక్తుల రద్దీ మొదలైంది. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్ ఆళ్వార్ట్యాంక్మీదుగా లేపాక్షి సర్కిల్, షాపింగ్ కాంపెక్స్ నుంచి లగేజీ కౌంటర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్లు వ్యాపించింది. వీరికి 17గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. అప్పటికీ నిజపాద దర్శనం రద్దుతో సర్వదర్శనం త్వరగా మొదలైంది. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన కుటుంబీకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాదభవనం, బస్టాండ్ వద్ద భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వసతి గదులకు కొరత ఏర్పడటంతో సామాన్య భక్తులు షెడ్లు, ఫుట్పాత్లపై, కార్యాలయాల ముందు, చెట్ల కింద సేదతీరుతున్నారు.