దోపిడీ కేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2022-09-13T06:18:41+05:30 IST
దోపిడీ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు
చిల్లకూరు, సెప్టెంబరు 12: దోపిడీ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం, తేనేజిల్లా, పున్నూరు గ్రామానికి చెందిన లక్ష్మణన్ అరుణాచలం లాజిస్టిక్ కంపెనీలో లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 10వ తేదీన లక్ష్మణన్ చెన్నై నుంచి కృష్ణపట్నం పోర్టుకు బొగ్గు లోడ్తో వెళుతూ మండలంలోని బూదనం టోల్ప్లాజా వద్ద లారీని నిలిపి బహిర్భూమికి వెళ్లాడు. దీంతో నాయుడుపేట ఎన్ఎస్ఆర్ కాలనీకి చెందిన మునెయ్య, చెంగయ్య, బాలాజీ అనే ముగ్గురు వ్యక్తులు లారీడ్రైవర్ లక్ష్మణన్ను బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 17,300 నగదు, 12గ్రాముల బంగారు దండ, మొబైల్, ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ను అపహరించుకు వెళ్లారు. దీంతో లక్ష్మణన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీకి పాల్పడిన మునెయ్య, చెంగయ్య, బాలాజీలను వరగలిక్రాస్రోడ్డు సమీపంలో అరెస్టు చేశామని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ గోపాల్, సుబ్రమణ్యం, ఆర్వీరాజు, వెంకటేశ్వర్లు, రహీం, విష్ణు, శ్రీనివాసులు రెడ్డి, రాధాకృష్ణ, నరసింహులు పాల్గొన్నారు.
తాళ్వాయిపాడులో పట్టపగలే దొంగతనం
పెళ్లకూరు : మండలంలోని తాళ్వాయిపాడు అరుంధతి కాలనీలో ఆదివారం గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ మనోజ్కుమార్ వివరాల మేరకు... అరుంధతి కాలనీకి చెందిన కంచి చెంగమ్మ, ఆమె భర్త చంద్రయ్య ఆదివారం ఉదయం ఊరెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు 80వేల విలువ గల బంగారు నగలతోపాటు 80వేల నగదు చోరీ చేశారు. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్న చెంగమ్మ ఇంటి తలుపుతీసి చూసే సరికి కిటికీ లేకుండా ఉన్న రంధ్రం ద్వారా ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు, బంగారు వస్తువులు అపహరణకు గురైనట్టు గుర్తించారు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ క్లూస్టీంతో కలసి ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.