సిమెంటు వచ్చింది.. పనులు చకచకా చేయండి
ABN , First Publish Date - 2022-11-22T00:31:40+05:30 IST
జిల్లాకు సిమెంటు రాక ప్రారంభమైందని, ఇక పాఠశాల భవన నిర్మాణ పనులు చకచకా చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 21: జిల్లాకు సిమెంటు రాక ప్రారంభమైందని, ఇక పాఠశాల భవన నిర్మాణ పనులు చకచకా చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జేసీ వెంకటేశ్వర్, ఎస్ఎ్సఏ ఏపీసీ వెంకటరమణా రెడ్డి, డీఈవో విజయేందర్తో కలిసి ఎంపీడీవో, ఎంఈవోలు, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాడు-నేడు రెండో విడత కింద 1213 పాఠశాలల్లో వివిధ రకాల పనులు జరుగుతుండగా, 80శాతానికి మించి నిర్మాణం పనులు 246 పాఠశాలల్లో జరుగుతున్నాయన్నారు. మూడు రోజులుగా సిమెంటు రావడంతో బిల్లులు అప్డేట్ చేసి అప్లోడ్ చేయాలని, చెల్లింపులు కూడా సమాంతరంగా చేయాలన్నారు. 12 మండలాల్లో 60శాతం కంటే తక్కువ పనులు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని వేగవంతం చేయాలని ఆదేశించారు.
గృహనిర్మాణాలకు రుణాలు
పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణాలకు బ్యాంకర్ల ద్వారా ఎస్హెచ్జీ గ్రూపుల ద్వారా విరివిగా రుణాలివ్వాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జేసీ వెంకటేశ్వర్, హౌసింగ్ పీడీ పద్మనాభంతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబరు 21న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఇందుకు అనువుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్యాల మేర ఇళ్ళ నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు.