మైనార్టీ సంక్షేమ పథకాల రద్దు దారుణం
ABN , First Publish Date - 2022-06-26T06:04:30+05:30 IST
రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమ పథకాలు దుల్హన్, రంజాన్ తోఫా పథకాలు రద్దు దారుణమని పలమనేరు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. దుల్హన్ పథకం అమలు చేసేందుకు నిధులు లేవని ప్రభుత్వం కోర్టుకు విన్నవించడం మైనార్టీలను మోసం చేయడమే అన్నారు.
పలమనేరు, జూన్ 25: రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమ పథకాలు దుల్హన్, రంజాన్ తోఫా పథకాలు రద్దు దారుణమని పలమనేరు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ... దుల్హన్ పథకం అమలు చేసేందుకు నిధులు లేవని ప్రభుత్వం కోర్టుకు విన్నవించడం మైనార్టీలను మోసం చేయడమే అన్నారు. చిత్తూరు పార్లమెంట్ టీడీపీ మైనార్టీ విభాగ అధ్యక్షుడు ఖాజాపీర్ మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు పంగనామాలు పెట్టిందని ఎద్దేవా చేశారు. మైనారిటీల ఓట్లతో గద్దె ఎక్కిన వైసీపీ గత మూడేళ్లుగా చేసింది ఏమీ లేదన్నారు. మైనారిటీల సంక్షేమానికి కృషి చేసింది ఎవరో, భవిష్యత్తులో పనిచేసే వారెవరో ఆలోచించాలని కోరారు. అధికార ప్రతినిధి ముబారక్ తాజ్, మైనారిటీ నాయకులు మాబాషా మాట్లాడుతూ... మైనార్టీల సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టదన్నారు. ఈ సమావేశంలో చాంద్బాషా, ఇమామ్, హనీఫ్, జిలాని, సాధిక్, నదీమ్, బాబాజాన్, అస్లాం, సయ్యద్, పర్వీన్తో పాటు ఆర్బీసీకుట్టి, గిరిబాబు, సుబ్రమణ్యంగౌడు, నాగరాజు, మదన్మోహన్, శ్రీధర్, శ్రీనివాసులు, కిషోర్, నాగరాజు, సుబ్రమణ్యం, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు.
వి.కోట: టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన దుల్హన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం దుర్మార్గపు చర్యగా టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ ఉమర్ అన్నారు. శనివారం వి.కోటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పేద ముస్లిం యువతుల పెళ్లిళ్లకు రూ.50 వేలు ఇచ్చిన ఘనత టీడీపీకి చెందగా రద్దు చేసి మాటతప్పి, మడమతిప్పిన ఘనత వైసీపీకే దక్కిందని ఎద్దేవా చేశారు. గడచిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ రూ.లక్ష ఇస్తామని చెప్పి తీరా అధికారంలోనికి వచ్చాక నిధులు లేవని హైకోర్డుకు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఐటీడీపీ కార్యవర్గ సభ్యుడు గౌస్పీర్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.