బర్డ్ ఆస్పత్రిలో ఒకే రోజున ఏడు గ్రహణ మొర్రి శస్త్రచికిత్సలు
ABN , First Publish Date - 2022-12-10T00:22:46+05:30 IST
టీడీకి చెందిన బర్డ్ ఆస్పత్రిలో ఒకేరోజున ఏడుగురు చిన్నారులకు విజయవంతంగా గ్రహణ మొర్రి శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరందరినీ శుక్రవారం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి చేసినట్టు బర్డ్ ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి తెలిపారు.
తిరుమల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి చెందిన బర్డ్ ఆస్పత్రిలో ఒకేరోజున ఏడుగురు చిన్నారులకు విజయవంతంగా గ్రహణ మొర్రి శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరందరినీ శుక్రవారం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జి చేసినట్టు బర్డ్ ప్రత్యేకాధికారి రెడ్డెప్పరెడ్డి తెలిపారు. దీంతో వైద్య బృందానికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అభినందనలు తెలిపారు. ఆస్పత్రిలో ఈఏడాది సెప్టెంబరులో గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 20 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన అడ్మిట్ అయిన లోహిత (ఆరు నెలలు), తన్విష్ (తొమ్మిది నెలలు), నాగహేమ (తొమ్మిది నెలలు), నాగలక్ష్మి (ఏడాది), నవీన్(12), రేఖ (2), జాహ్నవి(3)లకు ఏడో తేదీన గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు చేశారు. వీరిలో ఇద్దరికి మాత్రం పెదవికి, అంగిలికి(నోటి లోపల) రెండిటికీ శస్త్రచికిత్సలు చేశారు. బెంగళూరుకు చెందిన విజిటింగ్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రీతమ్ శెట్టి, డాక్టర్ దీపేష్ ఎన్ రావు, బర్డ్ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఝాన్సీ కలిసి ఈ శస్త్రచికిత్సలు చేశారు. మరింత మంది నిరుపేదలు బర్డ్ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని రెడ్డెప్పరెడ్డి సూచించారు.