భూసేకరణకు పరిహార అంచనాలు పంపండి
ABN , First Publish Date - 2022-11-30T00:04:57+05:30 IST
జిల్లాలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణకు నష్టపరిహార అంచనాలను త్వరితగతిన పంపాలని జేసీ వెంకటేశ్వర్ సూచించారు.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 29: జిల్లాలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణకు నష్టపరిహార అంచనాలను త్వరితగతిన పంపాలని జేసీ వెంకటేశ్వర్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు రామకృష్ణారెడ్డి, రేణుక, సదుం, సోమల, రొంపిచెర్ల, పులిచెర్ల, పుంగనూరు తహసీల్దార్లు పాల్గొన్నారు.
త్వరల్లో 84 గ్రామాల్లో డ్రోన్ సర్వే
త్వరలో మరో 84 గ్రామాల్లో డ్రోన్ సర్వే చేపట్టాలని జేసీ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం భూరీసర్వేకి సంబంధించి పలు అంశాలపై ఆయన రెవిన్యూ, సర్వే అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో 70 గ్రామాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా రీసర్వే పనులు పూర్తిచేయాలని సూచించారు. ఇప్పటివరకు 738 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికాగా, వాటిలో 200 గ్రామాల్లో ఓఆర్ఐ షీట్లు అందాయన్నారు. సరిహద్దురాళ్ళు నాటే ప్రక్రియ 17 గ్రామాల్లో చురుగ్గా సాగుతోందన్నారు. ఓఆర్ఐ షీట్లు అందిన వెంటనే గ్రౌండ్ ట్రూథింగ్ వంద రోజుల్లో పూర్తిచేయాలన్నారు. డ్రోన్ సర్వే అనంతరం ప్రభుత్వ భూములు, గ్రామ కంఠాలను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రాజశేఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్వీన్, ఆర్డీవోలు రామకృష్ణారెడ్డి, రేణుక, సృజన, శివయ్య, డీటీ శివకుమార్, ఇతర సర్వే, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.