52 రోడ్ల నిర్మాణానికి రూ.102కోట్లు: కలెక్టర్
ABN , First Publish Date - 2022-06-07T07:22:33+05:30 IST
52రోడ్లకు (436కిలోమీటర్లు) రూ.102కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు.
తిరుపతి(కొర్లగుంట), జూన్ 6: జిల్లా రహదారులు-భవనాలశాఖ ఆధ్వర్యంలో నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 52రోడ్లకు (436కిలోమీటర్లు) రూ.102కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. నాణ్యమైన రోడ్ల నిర్మాణం నాడు-నేడు పేరుతో కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక చాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయగా సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ ప్రదర్శనను వీక్షించడానికి ప్రజలను అనుమతించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రహదారులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.36కోట్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్శాఖ ద్వారా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీల పరిధిలోని లింకురోడ్ల అభివృద్ధికి (జిల్లా మొత్తం 98పనులు) రూ.49.80కోట్లు మంజూరైందని, ప్రస్తుతం టెండరు దశలో ఉన్నాయన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 259 కిలోమీటర్ల రోడ్లకు మహర్దశ లభిస్తుందన్నారు.