వైజ్ఞానిక పోటీలకు సన్నద్దం కండి
ABN , First Publish Date - 2022-11-21T01:32:52+05:30 IST
జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 22, 23 తేదీలలో పాఠశాల స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు రూపొందించేందుకు ప్రధానోపాధ్యాయులు సన్నద్దం కావాలని డీఈవో డాక్టర్ వి.శేఖర్ పేర్కొన్నారు.
తిరుపతి(విద్య), నవంబరు 20: జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 22, 23 తేదీలలో పాఠశాల స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు రూపొందించేందుకు ప్రధానోపాధ్యాయులు సన్నద్దం కావాలని డీఈవో డాక్టర్ వి.శేఖర్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్ర్తీయ దృక్పథం, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలు పెంచేందుకు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండల, జిల్లాస్థాయిలో పర్యావరణ అనుకూల పదార్థాలు, ఆరోగ్యం -పరిశుభ్రత, సాప్ట్వేర్ అండ్ యాప్స్, పర్యావరణ- వాతావరణ మార్పులు, గణిత నమూనాలు అనే అంశాలపై ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతిపాఠశాల నుంచి ఐదు ఉత్తమ నమూనాలను ఎంపికచేసి. వచ్చేనెల 12, 13 తేదీల్లో నిర్వహించే మండల స్థాయి ప్రదర్శనలకు హాజరుకావాలని సూచించారు. మండల స్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ ఎగ్జిబిట్లను వచ్చే ఏడాది జనవరి నెల 27, 28 తేదీల్లో జరిగే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించాల్సి ఉంటుందని వివరించారు. జిల్లాస్థాయిలో ఉత్తమ నమూనాలను ఎంపికచేసి ఫిబ్రవరి నెలలో జరిగే రాష్ట్రస్థాయి ప్రదర్శనా పోటీలకు పంపుతామని వెల్లడించారు. వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి కె.భానుప్రసాద్ ఫోన్ నెంబరు 9440511983ను సంప్రదించాలని తెలియజేశారు.