కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు

ABN , First Publish Date - 2022-08-17T06:26:56+05:30 IST

చిత్తూరు కలెక్టర్‌ సహా రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు

చిత్తూరు రూరల్‌, ఆగస్టు 16: చిత్తూరు కలెక్టర్‌ సహా రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు మండలం చెర్లోపల్లెలో పేదలకు ఇంటి స్థలాల కోసం 2004లో రెవెన్యూ అధికారులు స్థలాన్ని గుర్తించారు. చెర్లోపల్లెకి చెందిన రమణారెడ్డి నుంచి ఆ 82 సెంట్ల స్థలాన్ని సేకరించారు. అప్పటి నుంచి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, నిర్మాణాలు చేపట్టలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ భూమిని పరిశీలించినా, ఇళ్లస్థలాలకు కేటాయించలేదు. బెంగళూరు- తిరుపతి హైవేకి ఆనుకొని ఉన్న విలువైన భూమి కావడంతో ఓ ప్రజాప్రతినిధి కన్ను దీనిపై పడింది.  క్వారీ లీజు పేరుతో అనుమతులు ఇవ్వాలని ఆ ప్రజాప్రతినిధి దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులు అనుమతిచ్చారు. ఇంటి పట్టాల కోసం తీసుకున్న స్థలాన్ని క్వారీకి కేటాయించడంపై రమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన పరిహారాన్ని తిరిగి ఇచ్చేస్తానని, ఆ 82 సెంట్లను తిరిగి అప్పగించాలని కోరుతూ లోకాయుక్తను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లకు లోకాయుక్త నుంచి నోటీసులు వచ్చాయి. 


Updated Date - 2022-08-17T06:26:56+05:30 IST