ఆవులకు ‘లుంపి స్కిన్’ వ్యాధి
ABN , First Publish Date - 2022-09-17T05:50:13+05:30 IST
గంగాధరనెల్లూరు మండలం ఆత్మకూరు, వేల్కూరు పంచాయతీల పరిధిలో ఆవులకు కొత్తగా లుంపి స్కిన్ వ్యాధి సోకినట్లు వెటర్నరీశాఖ ఏడీ డాక్టర్ మురళీ మోహన్ తెలిపారు.
పాడిరైతులు అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ ఏడీ సూచన
గంగాధరనెల్లూరు, సెప్టెంబరు 16: గంగాధరనెల్లూరు మండలం ఆత్మకూరు, వేల్కూరు పంచాయతీల పరిధిలో ఆవులకు కొత్తగా లుంపి స్కిన్ వ్యాధి సోకినట్లు వెటర్నరీశాఖ ఏడీ డాక్టర్ మురళీ మోహన్ తెలిపారు. ఈ క్రమంలో పాడిరైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు.
వ్యాధి లక్షణాలు
వైర్స(కాఫ్రిఫాక్స్) వలన ఈ వ్యాధి వస్తుంది. ఆవులు, గేదెలలో వ్యాపిస్తుంది.
దోమలు, ఈగలతో పాటు మగ పిడుదుల వలన ఈ వ్యాధి విస్తృతం అవుతుంది.
ఆవులు, గేదెలకు అధికజ్వరం వస్తుంది. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. మేత తినలేవు. లింఫ గ్రంథుల వాపు, కళ్ళుకారి మందగించడం, నాలుగు కాళ్ళల్లోనూ వాపు ఉంటుంది. శరీరం మొత్తంపై బుడిపెలు ఏర్పడి.. అనంతరం అవి పుండ్లుగా మారి రక్తం కారుతుంది.
నివారణకు జాగ్రత్తలు
ఆవుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని వెటర్నరీ డాక్టర్లకు పాడిరైతులు తెలియజేయాలి.
ప్రస్తుతం పాడిరైతులు పశువులను కొనుగోలుచేయడం-అమ్మడం వంటి పనులు కొద్దిరోజులు మానుకోవాలి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక సంతలలో పాడిఆవులు కొనుగోలు చేయకూడదు.
వ్యాధి వచ్చిన గ్రామాలయందు వెంటనే పిడుదల మందు పిచికారి చేయించుకోవాలి. గోట్ఫాక్స్ వ్యాక్సిన్ని వేయించాలి.
ఆయుర్వేదిక్ లేపనాలు, యాంటీబయెటిక్స్. అనాల్జెసిక్స్. మందులు వినియోగించాలి.
తమిళనాడు సరిహద్దులో ఉన్న గంగాధరనెల్లూరు మండలంలో పాతవెంకటాపురం, కొత్తవెంకటాపురం పంచాయతీల్లో 254 పశువులకు, పాలసముద్రం మండలంలో 1200 పశువులకు ముందస్తుగా టీకాలు వేశారు.