12నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకం
ABN , First Publish Date - 2022-06-04T07:06:14+05:30 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు.
తిరుమల, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు.ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘అభిద్యేయక అభిషేకం’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటిరోజు మలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తీసేవేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించిన తర్వాత వజ్రకవచం అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు. రెండవరోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగింపు నిర్వహిస్తారు. చివరిరోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగించనున్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు ఏడాది పొడవునా శ్రీవారు ఈ బంగారు కవచంతోనే ఉంటారు.