ఎర్రచందనం వృక్షాలకు జియో ట్యాగింగ్
ABN , First Publish Date - 2022-06-26T07:04:09+05:30 IST
ఎర్రచందనం వృక్షాల పరిరక్షణతో పాటు స్మగ్లింగును అరికట్టడానికి డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు.
డ్రోన్ టెక్నాలజీ సాయంతో స్మగ్లింగును అరికట్టే ప్రయత్నం
తలకోన అటవీ ప్రాంతంలో ట్రయల్ రన్ ప్రారంభం
ఎర్రావారిపాలెం, జూన్ 25 : ఎర్రచందనం వృక్షాల పరిరక్షణతో పాటు స్మగ్లింగును అరికట్టడానికి డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో 5.74లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఎర్రచందన వృక్షాలు సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి. ఈ అరుదైన ఎర్రచందనం చెట్లను నరికించి చైనా, థాయ్లాండ్,జపాన్ ,దుబాయ్ దేశాలకు చేరవేస్తున్న స్మగ్లర్లు రూ.కోట్లు గడిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను ఆపడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. ప్రత్యేకంగా టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసినా ఫలితం అంతంత మాత్రంగానే వుంది.శేషాచలంలో ఎర్రచందన వృక్షాలను గతంలో యేటా ఎన్యూమరేషన్(వృక్షాల సంఖ్యను గణించడం) ప్రక్రియను అటవీ శాఖ చేపట్టేది. ఇటీవల ఎన్యూమరేషన్ కూడా సరిగా జరగడం లేదు. భారీగా ఎర్రచందన చెట్లను నరికివేయడం,వేర్లతో సహా తవ్వేయడంతో ఎర్రచందన వృక్షాల సంఖ్యపై స్పష్టత కొరవడింది.దీంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిం చుకుని ఎర్రచందన చెట్లను పరిరక్షించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.ఇప్పటికే అటవీశాఖ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించుకుని అడవుల్లో చోటుచేసుకునే అగ్నిప్రమాదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసు కుంటోంది.ఆయా బీట్ల పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేసి నష్ట నివారణకు చర్యలు తీసుకుంటోంది.ఈ క్రమం లో డ్రోన్ టెక్నాలజీ ద్వారా శేషాచలంలోని ఎర్రచందన చెట్లకు జియో ట్యాగ్ నెంబర్ కేటాయించనున్నారు. తద్వారా ఆ చెట్టు నరికివేతకు గురవుతున్న సమయంలోనే అటవీశాఖకు సమాచారం చేరనుంది. స్మగ్లింగును అరికట్టడంలో ఇదెంతో ఉపయోగపడనుంది. ఇందులో భాగంగా తలకోన అటవీ ప్రాంతంలోని సిద్ధలగండి ప్రాంతం నుంచి శనివారం డ్రోన్ కెమెరాల ద్వారా ఎర్రచందన చెట్లకు జియో ట్యాగింగ్ పనుల ట్రయల్ రన్ జరిపారు.ఈ కార్యక్రమంలో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటరు నాగేశ్వరరావు, వైల్డ్ లైఫ్ డీఎ్ఫవో పవన్ కుమార్,సీఐ తులసీరామ్, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.