‘గడప గడప’ పనులకు ప్రాధాన్యమివ్వండి
ABN , First Publish Date - 2022-12-09T23:53:21+05:30 IST
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 9: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వివిధశాఖల అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడప కార్యక్రమానికి 1553 పనులు అప్లోడ్ చేయగా, వాటిలో 1504 పనులు మంజూరు చేసినట్లు చెప్పారు. వివరాలు సక్రమంగా లేని మిగిలిన పనుల ఎస్టిమేట్లను వెనక్కి పంపించినట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులకు కావాల్సిన సిమెంటు కోసం కంపెనీలకు వెంటనే బకాయిలు చెల్లించి, తెప్పించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో జేసీ వెంకటేశ్వర్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్తో పాటు ఇతర ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా పథకంలో భాగంగా జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి ఆయన అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఇంకా ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. రూ.5 లక్షలలోపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగజ్యోతిని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన 488 శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో జేసీ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.