శ్రీవారి ఇండస్ర్టీలో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2022-12-31T02:00:34+05:30 IST
రేణిగుంట మండలం గురువరాజు పల్లె సమీపంలో మాస్క్లు, బ్యాగ్లు తయారు చేసే శ్రీవారి ఇండస్ర్టీలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.11 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.
రేణిగుంట, డిసెంబరు 30: రేణిగుంట మండలం గురువరాజు పల్లె సమీపంలో మాస్క్లు, బ్యాగ్లు తయారు చేసే శ్రీవారి ఇండస్ర్టీలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.11 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.కర్మాగారంలోని నాన్ ఓవన్ ఫ్యాబ్రిక్ ప్లాంట్ సమీపంలో మంటలు చెలరేగినట్లు మొదటి అంతస్తులో ఉన్న టైలర్లు మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో గుర్తించారు.గ్రౌండ్ ఫ్లోర్లో పనిచేస్తున్న సహచర కార్మికులకు గట్టిగా అరిచి చెప్పడంతో వారు అప్రమత్తమై అగ్నిప్రమాద నివారణ పరికరాల సాయంతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు.అయితే ప్లాంట్కు మంటలు అంటుకోవడంతో అగ్నిమాపక శాఖాధికారులు హుటాహుటిన వచ్చి విమానాశ్రయం నుంచి, శ్రీకాళహస్తి నుంచి మరో రెండు అగ్నిమాపక వాహనాలను తెప్పించి మంటలను అదుపు చేశారు.తిరుపతి అగ్నిమాపక దళ అధికారి కిరణ్కుమార్ మాట్లాడుతూ కర్మాగారంలో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అగ్నిమాపక నిబంధనలను పాటించకపోవడంతోనే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.షార్ట్సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని కర్మాగార యజమాని రాజేంద్ర శెట్టి అభిప్రాయపడ్డారు. 15 సంవత్సరాలుగా నడుస్తున్న కర్మాగారంలో దాదాపు 25 మంది పనిచేస్తున్నారన్నారు. రెండేళ్లక్రితం కర్మాగారం వెలుపల మంటలు చెలరేగాయన్నారు. ప్రస్తుత ప్రమాదంలో రూ.10 కోట్ల విలువగల యంత్రసామగ్రి,కోటి రూపాయల రా మెటీరియల్ దగ్ధమైందన్నారు.