తుది ఓటరు జాబితా జనవరి 5న
ABN , First Publish Date - 2022-08-07T07:38:21+05:30 IST
ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన కీలక మార్పులను తప్పకుండా అమలు చేయాలని జాతీయ ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ నితీ్షకుమార్ వ్యాస్ పేర్కొన్నారు.
తిరుపతి(రవాణా), ఆగస్టు 6: ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన కీలక మార్పులను తప్పకుండా అమలు చేయాలని జాతీయ ఎన్నికల కమిషన్ డిప్యూటీ కమిషనర్ నితీ్షకుమార్ వ్యాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖే్షకుమార్ మీనా, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎన్నికల అధికారులు కె. వెంకటరమణారెడ్డి, ఎం. హరినారాయణ్, ఈఆర్వోలతో తిరుపతిలో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదుకోసం మాత్రమే నిర్దేశించబడిందన్నారు. ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు సంబంధించిన ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాల్సి ఉంటుందన్నారు. నియోజవర్గ పరిధిలోనేకాక ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2023 షెడ్యూల్ మేరకు ప్రి రివిజన్, రివిజన్ ప్రక్రియలను జరిపి తుది జాబితా వచ్చే ఏడాది జనవరి 5న ప్రచురించాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 26 జిల్లాలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ నెల 4 నుంచి ప్రి రివిజన్, రివిజన్ యాక్టివిటీ జనవరి 3 నాటికి పూర్తిచేసి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు నియోజకవర్గాల వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.