బావిలో పడి.. బయట పడిందిలా..!
ABN , First Publish Date - 2022-11-16T01:11:46+05:30 IST
వ్యవసాయ బావిలో పడిన ఒంటరి మగ ఏనుగు
ఒంటరి మగ ఏనుగు పొలం బాట పట్టింది. మంగళవారం వేకువజామున.. వెలుతురులు విచ్చుకోక ముందే ఠీవిగా నడుస్తూ.. బంగారుపాళ్యం మండలం మొగిలి పంచాయతీ గాండ్లపల్లె సమీపంలోని రైతు జగన్నాఽథనాయుడికి చెందిన వ్యవసాయ బావిలో పడిపోయింది. ఏనుగు మునిగిపోయేంత నీళ్లు లేవు. పైకి వచ్చేందుకు ఆ గజరాజు చుట్టూ చూస్తూ తిరుగుతోంది. దీనిని గమనించిన స్థానికులు పలమనేరు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. డీఎ్ఫవో చైతన్యకుమార్రెడ్డి, రేంజర్ నయీం సిబ్బందితో కలిసి బావి వద్ద చేరుకొన్నారు. ఏనుగును వెలుపలికి తీసేందుకు బావికి ఉన్న రాతికట్టడాన్ని కొంతమేర ఎక్స్కవేటర్తో తొలగించారు. ఏనుగు వెలుపలికి వచ్చేందుకు వాలుగా మట్టి పోయించారు. అప్పటి వరకు వెలుపలికి వచ్చేందుకు విశ్వప్రయాత్నాలు చేసిన ఏనుగు.. కొంత దారి కనిపించగానే తొండం, ముందరి కాళ్ల సాయంతో పాకుతూ ఎలాగోలా నిలబడింది. నిదానంగా వెలుపలికి వచ్చింది. ఏనుగును చూసిన గ్రామస్తులు కేకలు వేశారు. ‘బతుకు జీవుడా..’ అనుకుంటూ ఏనుగు పొలాల గుండా వేగంగా పరుగెత్తి సమీపంలోని మామిడితోపులోకి వెళ్లింది. ట్రాకర్ల సాయంతో ఒంటరి ఏనుగును అటవీ లోతట్టు ప్రాంతానికి తరిమి వేశారు. బావిలో పడ్డ ఏనుగు టస్కర్ అని డీఎ్ఫవో చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఈ మగ ఏనుగులు ఒంటరిగానే ఉంటాయన్నారు. ఇవి చాలా ప్రమాదకరమైనవన్నారు. ఒంటరి ఏనుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాగా, దెబ్బతిన్న బావి కట్టడానికయ్యే ఖర్చును ప్రభుత్వానికి నివేదించి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ఈ తరహా బావులకు ప్రహరీ లేకపోవే జంతువులే కాదు ప్రమాదవశాత్తు మనుషులూ పడిపోయే ప్రమాదముందన్నారు. తమ బావుల చుట్టూ రైతులు ఫెన్సింగ్ లేదా ప్రహరీ నిర్మించుకోవలని సూచించారు.
- పలమనేరు