అవినీతి రెవెన్యూ అధికారులను జైలుకు పంపించాలి
ABN , First Publish Date - 2022-11-17T00:02:16+05:30 IST
‘అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. జైలుకు పంపించాలి. అంతేతప్ప సస్పెన్షన్ వంటి చర్యలతో సరిపెట్టకూడదు’ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి
వెదురుకుప్పం, నవంబరు 16: ‘అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. జైలుకు పంపించాలి. అంతేతప్ప సస్పెన్షన్ వంటి చర్యలతో సరిపెట్టకూడదు’ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామ పంచాయతీ బుచ్చిరెడ్డికండ్రిగ గ్రామంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీఆర్వో స్థాయి నుంచి రెవెన్యూ సిబ్బంది చాలా మంది అవినీతికి రుచిమరిగారని, ఆ శాఖలో కూడా కొందరు సక్రమంగా పనిచేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ సిబ్బందిపై అక్కడక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని, తన దృష్టికి కూడా వస్తున్నట్లు వివరించారు. ఎస్ఆర్పురం పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో తాను అక్కడికి తహసీల్దార్ షబీర్బాషా నీతిమంతుడని చెప్పానన్నారు. అయితే అతడి అవినీతి, అక్రమాల గురించి ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో జేసీని విచారణ జరపాలని రిక్వెస్ట్ చేశానని చెప్పారు. జేసీ విచారణలో ఎస్ఆర్పురం తహసీల్దార్ అక్రమాలు వెలుగు చూశాయన్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. పెనుమూరు తహసీల్దార్కి కూడా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని చెప్పినా ఆమె తీరుమారలేదన్నారు. తీరా వీడియోల్లో ఆమె రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం చూశామన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవడం కాదని, విచారణ జరిపి శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించి, జైలుకు పంపిస్తే మిగతా వాళ్లు బాగుపడతారన్నారు. మిగతా ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా భయపడతారని చెప్పారు.