వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2022-05-27T06:53:33+05:30 IST
యాదమరి మండలంలో వైసీపీ నాయకుల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదు కాకుండా రాజీ
చిత్తూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): యాదమరి మండలంలో వైసీపీ నాయకుల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని పెరియంబాడికి చెందిన వైసీపీ నేత, ఈడిగ సంఘం మండల అధ్యక్షుడు కరుణాకర్పై అదే పార్టీకి చెందిన కొందరు దాడి చేసినట్లు తెలిసింది. అందుకు కారణం అంటూ ప్రచారం అవుతున్న కథనం ఇలా ఉంది.. బుధవారం రాత్రి కరుణాకర్ యాదమరి నుంచి పెరియంబాడిలోని ఇంటికి వెళుతుండగా, పుల్లయ్యగారిపల్లె రోడ్డు పక్కన కొంతమంది మద్యం సేవిస్తూ కనిపించారు. కరుణాకర్ భార్య పెరింబాడి సర్పంచి కావడంతో, రోడ్డు పక్కన రాత్రిపూట ఎందుకు మద్యం సేవిస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో మాటా మాటా పెరిగింది. మద్యం బాటిల్తో వారు కరుణాకర్ మీద దాడి చేశారు. రక్త గాయాలైన కరుణాకర్ను కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి చిత్తూరులోని ప్రధాన ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స అనంతరం గురువారం ఉదయం ఇంటికి వెళ్లాడు. విషయం తెలియడంతో దాడులు కొనసాగకుండా పెరియంబాడి, కోడిగుట్ట గ్రామాల్లో పోలీసులు పర్యటించి, పర్యవేక్షించారు. తొలుత బాధితుడు కరుణాకర్ తనపై జరిగిన దాడి గురించి యాదమరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే గురువారం సాయంత్రం మళ్లీ కేసు వద్దనుకున్నారని చెబుతున్నారు. మీడియాలో వస్తే పార్టీ పరువు మంటగలుస్తుందనే ఉద్దేశ్యంతో మండలానికి చెందిన వైసీపీ కీలక నేత ఆధ్వర్యంలో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అసలు తనమీద ఎవ్వరూ దాడి చేయలేదని, బైకు మీద నుంచి పడి దెబ్బలు తగిలాయని తాజాగా కరుణాకర్ చెబుతుండడం కొసమెరుపు.