కూలుతున్న టీటీడీ కల్యాణ మండపం ఫాల్స్ సీలింగ్
ABN , First Publish Date - 2022-09-07T06:09:02+05:30 IST
కుప్పం పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానాల కల్యాణ మండపం పరిస్థితి అధ్వానంగా తయారైంది.మండపం లోపలివైపు ఏర్పాటు చేసిన ఫాల్స్ సీలింగ్ ఎక్కడికక్కడ రంధ్రాలు పడింది. కొన్నిచోట్ల అయితే సీలింగ్ మొత్తం కిందికి జారిపోయింది
కుప్పం, సెప్టెంబరు 6: పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానాల కల్యాణ మండపం పరిస్థితి అధ్వానంగా తయారైంది. వేలు పోసి ఈ మండలం బుక్ చేసుకుని వివాహాది శుభాకార్యాలు జరుపుకుంటున్న ప్రజలు, కనీస సౌకర్యాలు కరువై అవస్థల పాలవుతున్నారు. మండపాన్ని సుమారు మూడేళ్ల క్రితం సుందరంగా తయారు చేశారు. అయితే ప్రస్తుతం మండపం సుందరంగా కాదు కదా కనీసం మామూలుగా కూడా కనిపించడంలేదు. ముఖ్యంగా మండలం లోపలివైపు ఏర్పాటు చేసిన ఫాల్స్ సీలింగ్ ఎక్కడికక్కడ రంధ్రాలు పడింది. కొన్నిచోట్ల అయితే సీలింగ్ మొత్తం కిందికి జారిపోయింది. ఇక్కడ వివాహాలు చేసుకుని బంధుమిత్రులను ఆహ్వానిస్తున్న కుటుంబాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, మండపం మరమ్మతులు జరగడంలేదు. పైగా ఫాల్స్ సీలింగ్ ఎప్పుడు కూలుతుందో, ఎక్కడ శుభ కార్యం రసాభాస అవుతుందన్న ఆందోళన నిర్వాహకులకు తప్పడంలేదు. మరోపు వంటసామగ్రి సైతం టీటీడీ సరఫరా చేయడంలేదు. అన్నింటినీ మళ్లీ బయటనుంచి అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా టీటీడీ అధికారుల స్పందించి కనీసం కూలుతున్న ఫాల్స్ సీలింగ్ను తొలగించి, మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.