AP News: పాత్రికేయుడు గోపాల్ రెడ్డి మృతి పట్ల చంద్రబాబు, లోకేష్ సంతాపం

ABN , First Publish Date - 2022-09-29T18:39:28+05:30 IST

సీనియర్ జర్నలిస్ట్ గోపాల్ రెడ్డి మృతికి చంద్రబాబు, లోకేష్ సంతాపం ప్రకటించారు.

AP News: పాత్రికేయుడు గోపాల్ రెడ్డి మృతి పట్ల చంద్రబాబు, లోకేష్ సంతాపం

చిత్తూరు జిల్లా (Chittoor Dist.): తిరుపతి సీనియర్ జర్నలిస్ట్ (Senior Journalist) గోపాల్ రెడ్డి (Gopal Reddy) మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు,  మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఆయన తనయుడు నారా లోకేష్ (Nara Lokesh) సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మబ్బు గోపాల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై దిగ్భ్రాంతి చెందానన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల కవరేజ్‌కు వెళ్ళిన ఆయన కనుమ రోడ్డులో జరిగిన ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాన్ని, నాయకులను ప్రశ్నించే కలం యోధుడని, గోపాల్ రెడ్డి మరణం తిరుపతి జర్నలిస్ట్ వర్గానికి తీరని లోటని అన్నారు. వృత్తి నిబద్దతతో జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


నారా లోకేష్ మాట్లాడుతూ...సీనియర్ జర్నలిస్ట్ గోపాల్ రెడ్డి చివరి శ్వాస వరకూ విలువలతో కూడిన జర్నలిజం కోసం కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల కవరేజ్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తూ.. వారి కుటంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గోపాల్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేష్ కోరారు.

Updated Date - 2022-09-29T18:39:28+05:30 IST